జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో జీతాలు తీసుకుని..వారి త‌ర‌ఫున స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. స‌భ‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. బుధ‌వారం సాయంత్రం తెలంగాణ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తిపక్షం వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తార‌ని ఆశించామ‌న్నారు.

కానీ, ప్ర‌తిప‌క్షం బాధ్య‌త‌గా ప‌నిచేయ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా “కేసీఆర్‌.. మీరు స‌భ‌కు రండి. చ‌ర్చ‌ల్లో పాల్గొనండి“ అని సూచించారు. స‌భ‌కు రాకుండా జీతాలు తీసుకునే వారికి వేత‌నాల్లో కోత పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.

ఉద్యోగులు స‌రిగా రాక‌పోయినా.. సెల‌వులు పెట్టినా వేత‌నాల్లో కోత‌పెడుతున్నామ‌ని.. కానీ, స‌భ్యుల‌కు మాత్రం ఈ నిబంధ‌న వ‌ర్తించ‌డం లేద‌ని అన్నారు. దీనిపై అంద‌రూ ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నుల‌ను జీతాల రూపంలో తీసుకుంటున్న‌వారికి బాధ్య‌త ఉండాల‌ని.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించాల‌ని అన్నారు.

వార‌స‌త్వం కాదు..

రాజకీయాల్లో వార‌స‌త్వం స‌రికాద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప‌రోక్షంగా బీఆర్ ఎస్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. “ చాలా మంది గాంధీల కుటుంబం నుంచి వార‌సులు వ‌చ్చార‌ని అంటారు. కానీ, గాంధీల కుటుంబం నుంచి ఎవ‌రూ వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి రాలేదు. ఎంతో శ్ర‌మించి.. త‌మ‌ను తాము నిరూపించుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ప‌ద‌వులు చేప‌ట్టారు. తొలి ప్ర‌ధాని నెహ్రూ.. త‌న జీవితాన్ని ఈ దేశం కోసం త్యాగం చేశారు. ఇందిరాగాంధీ సైతం ప్రాణాలు అర్పించారు“ అని తెలిపారు.

పేద‌ల కోసం ఇందిరాగాంధీ విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ ఫ‌లితం కాంగ్రెస్ వ‌ల్లే ద‌క్కింద‌న్నారు. “ఈ రోజు మ‌నం ఈ ఫ‌లాలు అనుభ‌విస్తున్నామంటే అది కాంగ్రెస్ వల్లేన‌ని చెబుతున్నా. నాటి కాంగ్రెస్ పాల‌కులు తీసుకున్న నిర్ణ‌యాల‌వ‌ల్లే నేడు మ‌న ఫ‌లాలు అనుభ‌విస్తున్నాం.“ అని తెలిపారు.

నియంత పోక‌డ‌లు..

నియంత పోక‌డ‌ల‌తో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌ని బీఆర్ ఎస్ నాయ‌కుల‌పై సీఎం రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారం పోయినా.. అహంకారం పోలేద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం తెలంగాణ‌కు మార్గ‌ద‌ర్శ‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌తిపక్షం కూడా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని.. గ‌వ‌ర్న‌ర్‌కు ధ‌న్య‌వాదాలు చెబుతుంద‌ని ఆశించామ‌ని పేర్కొన్నారు. కానీ, వారికి అధికారం పోయినా అహంకారం లేద‌ని విమ‌ర్శించారు. రాజ్యాలు పోయినా.. రాచ‌రిక‌పు పోక‌డ‌లు పోలేదని దుయ్య‌బ‌ట్టారు.