చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్. ఇండియాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా రావాల్సి ఉందని, అందుకే దాన్ని ఇప్పటిదాకా రివీల్ చేయలేదని అంటున్నారు. DCP ఫైల్ తో పాటు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కు పంపాల్సిన కంటెంట్ ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు ఉదయం లోగా చేరుకునేలా నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేశారట.

ఇలా జరగడానికి కారణం లేకపోలేదు. మార్చి 19 విడుదల తేదీకి కట్టుబడటంతో పాటు ముందు రోజే ప్రీమియర్లు వేయాలన్న నిర్ణయం తీసుకోవడం వల్ల దర్శకుడు ఆదిత్య ధార్ టీమ్ మీద ఒత్తిడి పెరిగిపోయింది. కలర్ గ్రేడింగ్, రీ రికార్డింగ్ కొంత ఆలస్యం కావడం వల్ల అనుకున్న టైంకి ఫస్ట్ కాపీ సిద్ధం చేయలేకపోయారు. విదేశాలతో పోల్చుకుంటే మన సెన్సార్ నిబంధనలు కఠినం కాబట్టి వాటన్నిటిని ఫాలో అవుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.

ఇప్పటిదాకా ఉన్న సమాచారం మేరకు దురంధర్ ది రివెంజ్ ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాయంత్రం అయిదు గంటలకు ఒకేసారి షోలు ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే డబ్బింగ్ వెర్షన్లకు ఎలాంటి సమస్య రాకూడదని బయ్యర్లు కోరుకుంటున్నారు. కేవలం ప్రీమియర్ల నుంచే నలభై కోట్లకు పైగా రాబట్టేసిన దురంధర్ 2 మొదటి రోజు ఈజీగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేస్తుందని ట్రేడ్ ముందస్తుగా అంచనా వేస్తోంది.

ఒక హిందీ సినిమాకు ఈ స్థాయిలో ప్రతి చోటా హైప్ రావడం ఈ మధ్యకాలంలో దురంధర్ రివెంజ్ కే చూస్తున్నాం. గతంలో పఠాన్, జవాన్ లాంటివి మంచి ట్రెండ్స్ చూపించినప్పటికీ మరీ దురంధర్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే జిల్లా కేంద్రాలు, పట్టణాలు సైతం ఫుల్ అయినవి లేవు. ఒకవేళ రేపు రాత్రికి కనక పాజిటివ్ టాక్ వస్తే కనీసం వారం రోజులు టికెట్లు దొరకనంత ఊచకోత ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. జియో స్టూడియోస్ అయితే అంత నమ్మకంగా ఉంది.