వైసీపీ స‌భ‌లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌టౌట్లు.. చాలా సీరియ‌స్!

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎన్నిక‌ల‌కు ముందు.. విశాఖ న‌గ‌ర శివారులోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హి స్తున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు అంతే భారీగా ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. 3 లక్ష‌ల మంది ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించ‌డంతోపాటు.. వారి మ‌ద్ద‌తు కూడా త‌మ‌కే ఉంద‌ని చెప్పేలా నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నిక‌ల‌కు ముందు చాలా ప్ర‌తిష్టాత్మకంగా నిర్వ‌హిస్తున్న సిద్ధం స‌భ‌లో అనూహ్యంగా ప్ర‌తిప‌క్ష నాయ‌కుల క‌టౌట్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, సీపీఐ నేత రామ‌కృష్ణ ల క్యారికేచ‌ర్ ఫొటోల‌తో కూడా భారీ ఫ్లెక్సీలు ఇక్క‌డ క‌నిపిస్తున్నాయి.

దీంతో స‌భ‌కు వ‌చ్చిన వారు అమితాశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ స‌భ అంటే గిట్ట‌ని విప‌క్షాలు ఏర్పాటు చేశాయా? లేక .. దుండ‌గులు ఎవ‌రైనా రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల‌కు ఒడిగట్టేందుకు ఈ క‌టౌట్ల‌ను ఏర్పాటు చేశారా? అనే చ‌ర్చ జోరుగా సాగింది. కానీ, ఒకింత లోతుగా ఆలోచిస్తే.. ఈ ప్ర‌తిప‌క్ష నేత‌ల క‌టౌట్ల‌ను వైసీపీ అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు.. పార్టీ నాయ‌కులు ఇక్క‌డ ఏర్పాటు చేసిన‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి ఒక‌పార్టీ బ‌హిరంగ స‌భలో మ‌రో పార్టీ జెండా ఎగ‌రేసినా.. మ‌రో పార్టీ నాయ‌కుడి ప్ర‌స్తావ‌న వ‌చ్చినా.. తీవ్ర రాజ‌కీయ దుమారం రేగుతుంది.

అలాంటిది అధికార పార్టీ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ల క‌టౌట్లు క‌ట్టం చ‌ర్చ‌నీయాంశం అయింది. అంతేకాదు.. నిత్యం వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించే వీరిని సీఎం జ‌గ‌న్ త‌ర‌చుగా టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దుష్ట చ‌తుష్ట‌యం పేరుతో ప్ర‌తిప‌క్షాలు, ప‌త్రికాధిప‌తుల‌పై సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వారి విష‌యాల‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా వైసీపీ నాయ‌కులు చేస్తున్నారు. ఇలాంటి నాయ‌కుల క‌టౌట్ల‌ను ఏర్పాటు చేయ‌డం.. స‌హ‌జంగానే ఆస‌క్తిని రేపుతోంది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. వీరి పేర్ల‌తో విమ‌ర్శించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వీరి ఫొటోల‌ను కూడా చూపిస్తూ.. రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసేందుకు.. ఇలా ఏర్పాట్లు చేశార‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. ఇలా అయితే.. ప్ర‌జ‌ల్లో స్థిరంగా తాను చెప్పాల‌నుకున్న విష‌యం నిలిచిపోతుంద‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్టు చెబుతున్నారు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఏ పార్టీ కూడా చేయ‌ని విధంగా వైసీపీ స‌భ‌లో ప్ర‌తిపక్ష నాయ‌కుల క‌టౌట్లు పెట్టార‌ని అంటున్నారు.