బీజేపీలో తెలంగాణా సెంటిమెంటు

బీజేపీ అగ్రనేతల్లో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా నాటుకుపోయినట్లు అర్ధమవుతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని తెలంగాణా నుండే పూరించబోతోంది. జాతీయస్ధాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వీలుగా ఉంటుందని దేశంలోని అన్నీ పార్లమెంటు నియోజకవర్గాలను 143 క్లస్టర్లుగా విభజించింది నాయకత్వం. ఇందులో తెలంగాణాలోని 17 నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు. దేశంలోని మొదటి క్లస్టర్ మీటింగ్ పాలమూరు జిల్లాలో ఏర్పాటుచేశారు.

అంటే పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని అమిత్ షా తెలంగాణాలోనే ప్రారంభిస్తున్నట్లు లెక్క. ఈనెల 28వ తేదీన క్లస్టర్ మీటింగు కోసం వీలుంటే అమిత్ షా 27 రాత్రే హైదరాబాద్ కు చేరుకుంటారని పార్టీవర్గాలు చెప్పాయి. ముందురోజు సాయంత్రానికే హైదరాబాద్ చేరుకుంటే పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జీలతో భేటీ అవ్వచ్చని అనుకున్నారట. అలాగే ప్రచార వ్యూహాలను, ఏ రోజు ఏ నియోజకవర్గంలో ఎవరు ప్రచారం చేయాలనే షెడ్యూల్ ను కూడా రెడీ చేయచ్చని అనుకున్నారు.

మొదటి మీటింగుకు అమిత్ షా వస్తే తర్వాత మీటింగులకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించారో రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా సేమ్ అదే ప్యాటర్ను అనుసరించబోతున్నారు. 28వ తేదీన అమిత్ షా మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నట్లు కమలనాదులు చెప్పారు. 28వ తేదీన మధ్యాహ్నం మహబూబ్ నగర్ క్లస్టర్ మీటింగులో పాల్గొంటారు.

తర్వాత సాయంత్రం అక్కడి నుండి కరీంనగర్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్ క్లస్టర్ మీటింగులో నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత 6.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటారు. 8 గంటలవరకు హైదరాబాద్ క్టస్టర్ మీటింగులో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలవటంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఎందుకంటే ఏ సర్వేలో చూసినా బీజేపీకి 3 లేదా 4 సీట్లకు మించి రావనే తేలింది. అలాంటిది 8 సీట్లు గెలవటం అంటే మామూలు విషయం కాదు. దాని ప్రకారమే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పదిసీట్లకు తక్కువకాకుండా గెలవాలని, గెలుస్తామని కమలనాదులు పదేపదే ప్రకటనలిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.