జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. తాజాగా శుక్రవారం గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా రెండు అసెంబ్లీ టికెట్లు ప్రకటించుకున్నారు. రాజోలు, రాజానగరం సీట్లలో జనసేనే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సమయంలోనే ఆయన టీడీపీ పై సుతిమెత్తని విమర్శలు గుప్పించారు. తమకు చెప్పకుండానే సీట్లు కేటాయించుకోవడం.. సీఎం సీటు విషయంలో వ్యాఖ్యలు చేయడం వంటివి పొత్తు ధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
అనంతరం.. పార్టీ నాయకులతో పవన్ రహస్యంగా సమావేశమయ్యారు. ఈ నెల ఆఖరులోగా పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేస్తుందని..ఆయన చెప్పినట్టు తెలిసింది. అనంతరం.. అనూహ్యంగా ఢిల్లీ పర్యటనకు తరలి వెళ్లారు. శనివారం, లేదా ఆదివారం బీజేపీ పెద్దలతో ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ కానున్నారని తెలిసింది. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై ఆయన ఏదో ఒక తేల్చేసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ వస్తుందన్న ఆశలతో ఉన్నామని.. అయితే.. ఆ పార్టీ ఏదీ తేల్చకపోవడం.. క్షేత్రస్తాయిలో టికెట్లపై నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సహజంగానే పవన్పై ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యానికి తోడు.. వైసీపీ దూకుడుగా వెళ్తుండడం.. అభ్యర్థులను ఖరారు చేయడం కూడా పవన్ను ఆలోచనలో పడేస్తోంది. బీజేపీతో పొత్తు ఉంటే.. మూడు పార్టీలూ(జనసేన, టీడీపీ, బీజేపీ) సీట్లను పంచుకునే అవకాశం ఉంది. లేకపోతే.. కమ్యూనిస్టులు లేదా.. తమకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి పవన్.. పొత్తులతో ముందుకు సాగే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నా రు. ఏదేమైనా ఈ నెల ఆఖరు నాటికి తేల్చేయాలనే ఉద్దేశంతోనే పవన్ ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. బీజేపీ కలిసి వస్తుందన్న ఆశ ఉందని.. వారు చెబుతున్నారు. లేకపోతే.. టీడీపీ, కమ్యూనిస్టులతో కలిసి తాము ముందుకు వెళ్తామని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates