ఇండియాను నితీషే ముంచేస్తారా ?

ఇండియా కూటమిని దాని కన్వీనర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారే ముంచేసేట్లున్నారు. ఇప్పటికే మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలతో కూటమిలో గందరగోళం జరుగుతోంది. ఈ నేపధ్యంలో నితీష్ కూడా పెద్ద బండరాయి వేయటానికి రెడీ అవుతున్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే తొందరలోనే నితీష్ కూటిమికి గుడ్ బై చెప్పి మళ్ళీ ఎన్డీయేలో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా ఎన్డీయేలోని ముఖ్యులతో నితీష్ ఫోన్లో మాట్లాడినట్లుగా చెప్పుకుంటున్నారు.

దీనికి అదనంగా తన పార్టీ జేడీయూ ఎంఎల్ఏలతో నితీష్ పాట్నాలో అర్జంటుగా సమావేశం అవుతున్నారు. ఒకేసారి అంతమందిని పాట్నాకు రమ్మని నితీష్ ఎందుకు పిలిచారనే విషయమై ఆసక్తి పెరిగిపోతోంది. ఇండియా కూటమిలో నుండి తప్పుకుని తిరిగి ఎన్డీయేలో చేరటానికి ఆమోదం పొందటం కోసమే ఎంఎల్ఏలందరితో సమావేశం అవబోతున్నట్లు జాతీయ మీడియాలో హోరెత్తిపోతోంది. మరి ఇండియా కూటమిలో నుండి నితీష్ బయటకు వెళ్ళిపోతే బీహార్లో ప్రభుత్వం ఏమవుతుందనే ఉత్కంఠ పెరిగిపోతోంది.

ఎందుకంటే ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో నితీష్ జతకట్టి సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇపుడు నితీష్ గనుక ఎన్డీయేలో చేరితే మరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుగా ఉండవు. కాబట్టి ప్రభుత్వం పడిపోతుంది. అప్పుడు నితీష్ రాజీనామా చేయాల్సుంటుంది. అందుకనే నితీష్ బీజేపీ, జితిన్ రామ్ మాంగ్ఝీ పార్టీ హిందుస్ధాన్ ఆవామ్ మోర్చాలతో జతకట్టబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఇదే నిజమని అనుకున్నా బీజేపీ, మోర్చాలకు ప్రభుత్వాన్ని సుస్ధిరంగా ఉంచగలిగిన సంఖ్యాబలం తక్కువనే చెప్పాలి.

అంటే ఏదోఒకరోజు బీహార్లో నితీష్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కూటములను మార్చటం నితీష్ కు కొత్తేమీకాదు. 2013 నుండి తీసుకున్నా ఇప్పటికి నితీష్ ఐదుసార్లు కూటములను మార్చారు. ఎన్నిసార్లు కూటములను మార్చుతున్న ముఖ్యమంత్రి పదవి విషయంలో ఢోకా లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. గడచిన ఐదు ఎన్నికల్లో నితీష్ అసలు ఎంఎల్ఏగా పోటీచేసిందే లేదు. ఎంఎల్సీ అవటం ద్వారానే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. మరిపుడు ఏమి జరుగుతుందో చూడాలి.