క‌డ‌ప వైసీపీలో బిగ్ వికెట్లు డౌన్‌… !

మ‌రో రెండు మాసాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత అధికార పార్టీ వైసీపీ.. ప్ర‌తి విష‌యాన్నీ చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని రెండోసారి అధికారంలోకి రావాల‌ని ప‌రిత‌పిస్తున్న వైసీపీ.. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఐప్యాక్ స‌ర్వే స‌హా.. వ‌లంటీర్లు, ఇత‌ర మాధ్య‌మాల్లో అభ్య‌ర్థుల ప‌నితీరు, ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌డుతున్న విష‌యం తెలిసిందే.

ఈ స‌ర్వే నివేదికల ఆధారంగా.. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కీల‌క‌మైన నాయ‌కుల‌కు కూడా వైసీపీ అధిష్టానం స్థానాంత‌రం క‌ల్పించింది. వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా మ‌రో నియోజ‌క‌వ‌ర్గాల‌ను వారికి కేటాయించింది. మ‌రికొంద‌రిని అస‌లు ఎలాంటి అవ‌కాశం లేకుండా ప‌క్క‌న కూడా పెట్టేసింది. దీనికి ఇష్ట‌ప‌డి వారు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నా.. వైసీపీ మాత్రం త‌న ప‌నితాను చేసుకుని పోతోంది.

ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మ‌డి క‌డ‌ప‌లోనూ స‌ర్వేల ఆధారంగానే టికెట్ లు కేటాయించే కార్య‌క్ర‌మానికి వైసీసీ అధిష్టానం శ్రీకారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లోని 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. పైగా భారీ మెజారిటీ ద‌క్కింది కూడా ఇక్క‌డే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొత్తం అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకునేలా పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.

ఈ క్ర‌మంలో స్థానిక ప‌రిస్థితులు, సామాజిక వ‌ర్గాల కూర్పు, స‌ర్వే నివేదిక‌లు చెబుతున్న అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న వైసీపీ.. ఆ మేర‌కు అభ్య‌ర్థుల‌ను మార్పులు చేర్పులు చేస్తోంది. సొంత జిల్లా క‌దా.. అని సీఎం జ‌గ‌న్ ఎక్కడా ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. క‌డ‌ప ఎమ్మెల్యే క‌మ్ డిప్యూటీ సీఎంగా ఉన్న అంజాద్‌ను ఇప్ప‌టికే త‌ప్పించారు. రాజంపేటలో మేడా మ‌ల్లికార్జున రెడ్డిని ప్ర‌క్క‌న పెట్టారు.

ఈ నేప‌థ్యంలో మ‌రో న‌లుగురిని కూడా త‌ప్పించేందుకు ప్రణాళికా యుతంగా ముందుకు సాగుతున్న‌ట్టు స‌మాచారం. కీల‌క నేత‌లుగా ఉన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్‌, రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డిల‌కు కూడా ఈద‌ఫా టికెట్ ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.