షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉంది: ఉండవల్లి

ఏపీలో సీనియర్ పొలిటిషియన్, కాంగ్రెస్ హార్డ్ కోర్ అభిమాని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రిలో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసానికి వెళ్లిన షర్మిల..ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అయితే, ఉండవల్లిని కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే షర్మిలతో భేటీపై మీడియాతో ఉండవల్లి మాట్లాడారు. షర్మిలతో రాజకీయాల గురించి చర్చించలేదని ఉండవల్లి వెల్లడించారు.

తన ఆశీస్సుల కోసం షర్మిల వచ్చారని, ఆమెకు తన సహకారం ఎల్లపుడూ ఉంటుందని ఆయన చెప్పారు. షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని, 2 నెలల్లో రానున్న ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో పాలన సమర్థవంతంగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్‌లో ఉన్న నడవడిక షర్మిలకు వచ్చిందని, వైఎస్సార్ కుమార్తెగా ఆమెకు గుర్తింపు ఉందని అన్నారు. ఏడేళ్ల క్రితం తన వద్దకు జగన్ వచ్చారని, జగన్ తో కొన్ని సార్లు మాట్లాడానని, పరిచయం ఉందని అన్నారు. కానీ, షర్మిలతో పెద్దగా మాట్లాడింది లేదని చెప్పారు. కుటుంబ కలహాలతో వారు విడిపోవటం సహజమని, రాజకీయాలు వేరని అన్నారు.

షర్మిలలో వైఎస్ఆర్ పోలికలున్నాయని, ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడగలిగే రాజకీయ చతురత ఉందని కితాబిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడాల్సిన అవసరముందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలున్నాయని చెప్పారు. కాగా, ఉండవల్లి కుటుంబంతో వైఎస్ఆర్ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని షర్మిల చెప్పారు. ఉండవల్లిని మర్యాదపూర్వకంగానే కలిశానని, రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. వైఎస్సార్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లను తాను కలుస్తున్నానని చెప్పారు.