మణిపూర్‌ను అడ్డుపెట్టి.. ష‌ర్మిల వ్యూహం అర్ధ‌మైందా?

రాజ‌కీయాలు రాజ‌కీయాలే.. అనుబంధాలు అనుబంధాలే అన్న‌ట్టుగా కాంగ్రెస్ కొత్త చీఫ్ వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. ఏపీలోకి అడుగు పెడుతూనే.. ఆమె అన్న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే కొన్ని సీరియ‌స్ కామెంట్లు కూడా చేశారు. ఎక్క‌డో ఈశాన్య రాష్ట్ర‌మైన‌ మ‌ణిపూర్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. అక్క‌డ దాడులు జ‌రిగితే.. ఇక్క‌డ జ‌గ‌న్ ఎందుకు స్పందించ‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు.

ఈ క్ర‌మంలోనే మ‌తం కార్డును కూడా ష‌ర్మిల బ‌య‌ట‌కు తీశారు. క్రైస్త‌వుల‌పై దాడులు జ‌రుగుతుంటే.. జ‌గన్ ఎందుకు స్పందించ‌లేద‌ని.. ఈ దాడుల‌ను చూస్తూ ఉన్న బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికార‌ని.. మ‌నుషులేనా? అని కూడా ప్ర‌శ్నించారు. అయితే.. నిజానికి ష‌ర్మిల‌కు ఇచ్చిన ఉద్యోగం.. ఏపీలో కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేయ‌మని.. ఇక్క‌డ పాల‌న‌లోకి వ‌చ్చే రేంజ్‌లో పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని. అయితే.. ఆమె మాత్రం వ‌చ్చీరావ‌డంతో ఏపీకి 2 వేల కిలో మీట‌ర్ల‌కు పైగా దూరంలో ఉన్న మ‌ణిపూర్ అంశాన్ని కెలికేశారు.

కానీ, వాస్త‌వం ఏంటంటే.. ష‌ర్మిల ప‌క్కా వ్యూహంతోనే ఉన్న‌ట్టు అర్ధ‌మైంది. మ‌ణిపూర్ నెపంతో క్రైస్త‌వుల్లో ఒక అల‌జ‌డి సృష్టించి.. జ‌గ‌న్‌కు, వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓటు బ్యాంకును దూరం చేయాల‌నే వ్యూహం. ఇంత‌కు మించి ఆమె ఆశించింది ఏమీ లేదు. ఏదో ఒక‌ర‌కంగా వైసీపీని నిర్వీర్యం చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. పోనీ.. ష‌ర్మిల అనుకున్న‌ట్టుగా.. జ‌గ‌న్ స్పందించి.. మ‌ణిపూర్ ఘ‌ట‌న‌ను ఖండిస్తే.. అక్క‌డ దాడులు ఆగిపోతాయా? అక్క‌డి బాధితుల‌కు న్యాయం జ‌రిగిపోతుందా? అన్న‌ది ఆమె చెప్పాలి.

పోనీ.. ఖండిస్తే చాలు అనుకుంటే.. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా నుంచి రాహుల్ వ‌ర‌కు రోజూ ఈ ఘ‌ట‌న‌ల‌ను ఖండిస్తూనే ఉన్నారు. కానీ, ఏం జ‌రిగింది? పైగా ఏపీకి ఎలాంటి సంబంధం లేని ఈ శాన్య రాష్ట్రం మ‌ణిపూర్ గోడ‌వ‌ల‌ను ప‌ట్టించుకుని.. వాటిని ఖండిస్తూ.. కూర్చుంటే.. ఇక్క‌డ పాల‌న ఎవ‌రు చేస్తారు? ఇక్క‌డి స‌మ‌స్య‌లు ఎవ‌రు ప‌రిష్క‌రిస్తారు? పోయిపోయి.. క‌య్యానికి దిగి.. కేంద్రంతో ఉన్న అనుబంధాన్ని కూడా తెంచేసుకుని.. చేతులు ముడుచుకుని కూర్చోవాల‌న్న‌దే.. ష‌ర్మిల ఉద్దేశమా? అనేది మెజారిటీ వైసీపీ నాయ‌కులు సంధిస్తున్న ప్ర‌శ్న‌. ఇలాంటి వ్యూహాలు స‌రికావ‌ని.. క్రైస్త‌వులు అన్నీ గ‌మ‌నిస్తూనే ఉన్నార‌ని.. అంటున్నారు.