ఆ ‘ఆత్మే’ ష‌ర్మిల‌ను న‌డిపిస్తుందా?

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల‌ను ఎవ‌రు న‌డిపిస్తున్నారు? ఎన్నిక‌ల‌కు ముందు ఆమెను న‌డిపించేవారు ఎవ‌రు? అన్న అంశాల‌పై క్లారిటీ వ‌చ్చింది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత ఆప్తుడు.. ఆయ‌న‌తో అవినాభావ సంబంధాలు ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామచంద్ర‌రావే ఇప్పుడు కూడా ఆప్తుడిగా మారుతున్నార‌నేది స్ప‌ష్ట‌మైంది. ఆ ఆత్మే.. ఈ ష‌ర్మిల‌ను న‌డిపిస్తోంద‌ని, న‌డిపిస్తుంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికిప్పుడు ఏపీ బాధ్య‌త‌ల‌ను ష‌ర్మిల‌కు అప్ప‌గించినా.. కీల‌క నేత‌లు ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌తార‌నే అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అదేస‌మ‌యంలో పార్టీని ప‌రిణితితో కూడిన ఆలోచ‌న‌ల‌తో ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో కేవీపీ రామ‌చంద్రరావు.. ఆమెకు ఆశాకిర‌ణంగా మారారు. ఆమెను అన్ని విధాలా ముందుకు న‌డిపించ‌డంతోపాటు.. పాత‌కాపుల్లో ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టు నేప‌థ్యంలో వారిని ఆమెకు చేరువ చేసేందుకు కూడా కేవీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసే అవ‌కాశం ఉంది.

ప్ర‌ధానంగా వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తెర‌వెనుక వ్యూహాల‌ను అమ‌లు చేసింది కేవీపీనే. ఆయ‌నే అన్ని ర‌కాలుగా కాంగ్రెస్‌కు చేరువ‌య్యారు. కాంగ్రెస్‌లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర‌కు వెళ్ల‌కుండా త‌నే ప్ర‌య‌త్నించి.. వాటిని ప‌రిష్క‌రించేవారు కూడా. అందుకే వైఎస్ పాల‌న‌పై దృష్టిపెట్ట‌గా. కేవీపీ ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు, పార్టీలో నేత‌ల వ్య‌వ‌హారాలు.. వారిని బుజ్జ‌గించ‌డం.. వంటి విష‌యాల‌పై ఎక్కువ‌గా ప‌నిచేసేవారు.

ఇప్పుడు ఏపీలోనూ ష‌ర్మిల‌కు కేవీపీనే కీల‌కంగా మారుతున్నార‌నే వాద‌న ఉంది. ముఖ్యంగా పార్టీ చేరిక‌లు ఇప్పుడు అత్యంత అవ‌స‌రం. పైగా పాత‌కాపుల‌కు న‌మ్మ‌కం క‌ల‌గ‌డం.. వారు ఇత‌ర పార్టీల నుంచి వ‌స్తే.. జ‌రిగే ల‌బ్ది వంటి అనేక అంశాలు కీల‌కంగా ఉన్నాయి. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు ష‌ర్మిల అన్ని విష‌యాల‌పైనా దృష్టి పెట్టే అవ‌కాశం లేదు. దీంతో కేవీపీనే ఆమెకు అన్ని విష‌యాల్లోనూ చేదోడుగా ఉండే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో ఆయ‌న కీల‌కంగా న‌మ్మ‌కంగా ప‌నిచేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.