టీఎస్పీఎస్సీకి ఇంత డిమాండా

కేసీయార్ పదేళ్ళ పాలనలో బాగా పాపులరైన టీఎస్పీఎస్సీకి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. గ్రూప్ పరీక్షలను నిర్వహించి, అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి, ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిందే టీఎస్పీఎస్సీ. గడచిన పదేళ్ళల్లో తన లక్ష్యాలను చేరుకోకపోయినా నిత్యం బాగా వార్తల్లో అయితే నిలిచింది. కారణాలు ఏమిటంటే ఇంతటి వివాదాస్పదమైన బోర్డు మరోటి లేదు కాబట్టే. పరీక్షల కోసం టీఎస్సపీస్సీ బోర్డు నోటిపికేషన్లు జారీచేయటం, పరీక్షల పేపర్లు లీకవ్వటంతో నిరుద్యోగులు, విద్యార్ధిసంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన గోలతో బోర్డు బాగా పాపులరైపోయింది.

అలాంటి బోర్డు పాలకవర్గాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగనంపింది. కేసీయార్ హయాంలో ఆర్ధిక అవకతవకలతో పాటు ఇతరత్రా బాగా వివాదాస్పదమైన బోర్డు పాలకవర్గాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక తీరుకు తీసుకువద్దామని ప్రయత్నిస్తోంది. అందుకనే ఛైర్మన్ తో పాటు ఎనిమిది మంది సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఇంకా ఇద్దరు సభ్యులు రాజీనామాలు చేయలేదు. సో ఛైర్మన్ తో పాటు ఎనిమిది మంది సభ్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అర్హతలను నిర్ణయించి దరఖాస్తులు చేసుకోమని నోటిపికేషన్లో కోరింది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం నోటిపికేషన్లోని పోస్టులకు సుమారు 900 దరఖాస్తులు వచ్చాయట. అంటే ఒక పోస్టుకు సగటున 100 దరఖాస్తులు వచ్చినట్లు అనుకోవాలి. కాకపోతే ఇందులో ఛైర్మన్ పోస్టుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నది తేలలేదు. మాజీ ఎంఎల్ఏలు, మాజీ కార్పొరేటర్లు, రాజకీయాపార్టీల నేతలు, ప్రొఫెసర్లు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని ఛైర్మన్ గాను ప్రొఫెసర్లు, విద్యారంగంలో కాని ఇతరత్రా రంగాల్లో నిపుణులను సభ్యులుగా నియమించాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. బోర్డుకు రాజకీయ వాసనలు సోకకుండా మంచి ఉద్దేశ్యంతో భర్తీచేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే బోర్డును ఒకసారి నియమిస్తే ఆరేళ్ళ వరకు ప్రభుత్వం రద్దుచేసేందుకు లేదు. నియమించటం వరకే ప్రభుత్వం చేతిలోని పని. నియమించేసిన తర్వాత ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం తొలగించాలన్నా సాధ్యంకాదు. కాబట్టి నియమించేటపుడే అన్నీ కోణాల్లోను ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.