జ‌గ‌న్ ఆస్తుల కేసులు ఇంకెన్నాళ్లు సాగ‌దీస్తారు: సుప్రీంకోర్టు

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సంబంధించి న‌మోదైన అక్ర‌మాస్తుల కేసుల‌ను ఇంకెన్నాళ్లు సాగ‌దీస్తార‌ని సుప్రీం కోర్టు ప్ర‌శ్నించింది. ప్ర‌జాప్ర‌తినిధుల అక్ర‌మాల‌కు సంబంధించిన కేసుల‌ను సాగ‌దీస్తూ పోవ‌డం ఫ్యాష‌న్‌గా మారిపోయింద‌ని వ్యాఖ్యానించింది. పిటిష‌నర్‌(వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు) చుట్టూ ఎన్ని రాజ‌కీయ వివాదాలు ఉన్నా.. ఆయ‌న లేవ‌నెత్తిన ఒకే ఒక్క విష‌యం త‌మ‌ను ప్ర‌శ్నార్థకం చేసింద‌ని.. పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు అవ‌కాశం క‌ల్పించింద‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఏం జ‌రిగిందంటే..

కొన్నాళ్ల కింద‌ట ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కారు. సీఎం జ‌గ‌న్‌పై న‌మోదైన కేసుల విచార‌ణ తెలంగాణ హైకోర్టులో చాలా నెమ్మ‌దిగా సాగుతోంద‌ని.. వేగం పుంజుకునేలా చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు. ఇదేస‌మ‌యంలో అస‌లు ఈ కేసును వేరే రాష్ట్రానికి బ‌దిలీ చేయాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. అప్ప‌ట్లోనే ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. సీబీఐ, సీఎం జ‌గ‌న్‌కు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు శుక్ర‌వారం తాజాగా సుప్రీంకోర్టు ముందు ఈ విచార‌ణ వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా సీబీఐ త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ తుషార్ మెహ‌తా వాద‌న‌లు వినిపిస్తూ.. కేసు విచార‌ణ సాగ‌దీత‌కు తాము బాధ్యులం కాద‌న్నారు. అంతేకాదు.. దిగ‌వ‌స్థాయి కోర్టు్ల నిర్ణ‌యాల‌ను బ‌ట్టి న‌డుచుకుం టామ‌న్నారు. మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల‌నే తెలంగాణ హైకోర్టు పాటిస్తోంద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా జోక్యం చేసుకున్న ధ‌ర్మాస‌నం.. ఎన్నాళ్లిలా కేసులు సాగ‌దీస్తారు? అని నిల‌దీసింది.

పిటిష‌న‌ర్ ఉద్దేశం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న లేవ‌నెత్తిన అంశంలో తీవ్ర‌త ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌జాప్ర‌తినిదుల‌కు సంబంధించిన కేసుల‌ను సాగ‌దీయ‌రాద‌న్న గ‌త తీర్పుల‌ను దృష్టిలో ఉంచుకుని.. వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని తెలిపింది. క‌నీసం ఇన్నాళ్ల‌యినా.. ఒక్క డిశ్చార్జ్ పిటిష‌న్ అయినా వేశారా? అని కోర్టు ప్ర‌శ్నించింది. అయితే.. ఈ కేసులు తెలంగాణ హైకోర్టు ప‌రిధిలో ఉన్నాయ‌న్న జ‌గ‌న్ త‌ర‌ఫున న్యాయ‌వాదుల వాద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేసు విచార‌ణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.