వాసిరెడ్డి ప‌ద్మ‌కు అసెంబ్లీ టికెట్‌.. గెలిచేనా..!

గ‌త రెండు రోజులుగా.. వైసీపీ వ‌ర్గాల్లో వాసిరెడ్డి ప‌ద్మ పేరు మార్మోగుతోంది. తాజాగా ఆమెకు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి పిలుపు కూడా వ‌చ్చింది. ఈ రోజో రేపో.. ఆమె ముఖ్య‌మంత్రిని కూడా క‌ల‌వ‌నున్నారు . రాబోయే ఎన్నికల్లో ఆమెకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఆమె పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. కీల‌క‌మైన జ‌గ్గ‌య్య పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమెను బ‌రిలో నిలుపుతార‌ని కూడా అంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఇదే నిజ‌మైతే.. అంటే.. ఆమెకు టికెట్ ఇస్తే.. రాజ‌కీయాల‌కు కొత్త‌కాక‌పోయినా.. వాసిరెడ్డి ప‌ద్మ‌.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో మాత్రం కొత్త‌నే చెప్పాలి. 2009లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌ద్మ‌.. అప్ప‌ట్లో చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ ద్వారా.. వెలుగులోకి వ‌చ్చారు. ఆ పార్టీకి అధికార ప్ర‌తినిధిగా ఉన్నారు. అయితే.. ఆమెకు టికెట్ ఇవ్వ‌లేదు. ఇక‌, త‌ర్వాత‌.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక‌.. కొన్నాళ్లు మౌనంగా ఉన్న ప‌ద్మ‌.. వైసీపీ ఆవిర్భావంతో ఈ పార్టీలో చేరారు. పార్టీ అధికార ప్ర‌తినిధిగా చాలా సంవ‌త్స‌రాలు ప‌నిచేశారు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వైఎస్ జ‌గ‌న్‌కు అభిమానిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆటుపోట్లు ఎదురైనా..త‌ట్టుకుని నిలిచారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌ద్మ‌.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వెస్లీని వివాహం చేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఆమెను జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ, ఇది బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం. టీడీపీకి ఒక‌ర‌కంగా.. కంచుకోట అనే చెప్పాలి.

ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు బ‌లం ఉన్నా.. త‌ర్వాత‌.. అది టీడీపీకి అనుకూలంగా మారింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో సామినేని ఉద‌య‌భాను.. వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. ఇప్పుడు ఆయ‌న‌కు సీటు లేకుండా చేసి.. ప‌ద్మ‌కు అవ‌కాశం ఇస్తే.. ఇంటా బ‌య‌టా కూడా.. ప‌ద్మ నెట్టుకురావ‌డం.. అంత ఈజీ అయితే కాద‌నే అభిప్రాయం ఉంది. సామినేని ఆమెకు యాంటీగా రాజ‌కీయాలు చేయ‌డం ఖాయంగాక‌నిపిస్తోంది. ఇక‌, టీడీపీ నేత‌.. శ్రీరాంతాత‌య్య కు ఇప్ప‌టికే సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయి. దీంతో సొంత పార్టీ నుంచి స‌హ‌కారం కొర‌వ‌డి.. టీడీపీ దూకుడు పెరిగితే.. ప‌ద్మ ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటార‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు మంచిది కాద‌నేది వైసీపీ నేత‌ల సూచ‌న‌.