పవన్ ను ఆహ్వానించిన షర్మిల

తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని పలువురు రాజకీయ ప్రముఖులకు వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న సంగతి తె లిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కొద్ది రోజుల క్రితం కలిసి ఆహ్వాన పత్రికను షర్మిల స్వయంగా అందజేశారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను షర్మిల కలిసి ఆహ్వాన పత్రికను ఇచ్చారు.

తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని పవన్ ను షర్మిల కోరారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లిన షర్మిల పవన్ తో కాసేపు మాట్లాడారు. నూతన వధూవరుల గురించి షర్మిలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితులైన సందర్భంగా షర్మిలకు పుష్ప గుచ్ఛం ఇచ్చి పవన్ అభినందించారు. మరోవైపు, రాజారెడ్డి, ప్రియ అట్లూరిల నిశ్చితార్ధం ఈ నెల 18వ తేదీన జరగనుంది. జగన్‌తో చాలాకాలంగా దూరంగా ఉన్న షర్మిల తన కుమారుడి నిశ్చితార్ధం, పెళ్లికి హాజరు కావాలని స్వయంగా తాడేపల్లిలో జగన్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.

హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరగనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ లను కూడా షర్మిల ఆహ్వానించడం, షర్మిలతో చాలా రోజులుగా గ్యాప్ ఉన్న నేపథ్యంలో మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజారెడ్డి, ప్రియల వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరగనుంది. నిశ్చితార్ధ ఆహ్వానాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.