కాళేశ్వరంలో అవినీతి ఎంత? మరిన్ని రహస్యాలు బహిర్గతం

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా ఇపుడు బయటపడుతోందని వార్తలు వస్తున్నాయి. కేసీయార్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన కుటుంబసభ్యులు ఆదాయవనరుగా చేసుకున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎప్పటినుండో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరోపించారు. చాలాకాలంగా ఇవన్నీ ఆరోపణలుగానే వినబడుతున్నాయి. అయితే తాజా డెవలప్మెంట్లో ప్రాజెక్టులో జరిగిన అవినీతి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలో బయటపడిందని సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా లాభపడింది కాంట్రాక్టు సంస్ధలు మాత్రమే అన్న విషయం కాగ్ రిపోర్టులో వెలుగుచూసింది. ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేసిందే కాంట్రాక్టర్ల కోసమని,  చేసిన పేమెంట్లలో ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో కాగ్ రిపోర్టులో బయటపడిందని కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. కాళేశ్వరంకు బిగించిన భారీ మోటార్ల కొనుగోలు, బిగింపుల్లో కూడా అవినీతి భారీగానే జరిగిందట. మోటార్ల వాస్తవ ధరకన్నా 327 శాతం ఎక్కవ ధరలను చెల్లించినట్లు కాగ్ గుర్తించింది. మార్కెట్ తో సంబంధంలేకుండా ధరలను కేసీయార్ ప్రభుత్వం ఫిక్స్ చేసినట్లు కాగ్ చెప్పిందట.

ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి రు. 60 లక్షలతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం తర్వాత రు. 2.57 కోట్లు చెల్లించినట్లు బయటపడింది. 17 ప్యాకేజీల్లో అయిన ఖర్చుల వివరాలను కాగ్ కు కేసీయార్ ప్రభుత్వం ఇవ్వనేలేదట. కాబట్టి ఆ ప్యాకేజీల్లో అయిన ఖర్చులు, చెల్లింపులు, ఏమైనా అవినీతి జరిగుంటే ఆ వివరాలు తెలీదని కాగ్ తన రిపోర్టులో చెప్పిందని తెలిసింది.  

అసలు ప్రాజెక్టు అంచనా వ్యయమే రు.63,852 కోట్లుగా కేసీయార్ ప్రభుత్వం తేల్చింది. అయితే కొంతకాలానికి సవరించిన అంచనాల పేరుతో ఈ మొత్తాన్ని రు. 81,911 కోట్లకు పెంచింది. వివిధ కార్పొరేషన్ల నుండి ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం తీసుకున్న అప్పు రు. 87,449 కోట్లు. 2022 మార్చికే ప్రభుత్వం చేసిన ఖర్చు రు. 86, 788 కోట్లు. మొత్తం 18.26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సుండగా ఇచ్చింది కేవలం 40,288 ఎకరాలు మాత్రమే. అంటే ప్రాజెక్టు ముసుగులో ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో అర్ధమవుతోందని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. మరి కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏమంటాయో చూడాలి.