సినిమా హీరోలా మారిన ఎస్పీ !

Prakasham SP Kaushal

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకాశం జిల్లాలోని ఇటీవల పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఆ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.. తమ డిపార్ట్‌మెంట్ సిబ్బందిపై కొరఢా ఝులిపిస్తున్న తీరు సంచలనం రేపుతోంది.

పది రోజుల వ్యవధిలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ 50 మందికి పైగా సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం గమనార్హం. ఇవన్నీ అవినీతి వ్యవహారాల వల్ల జరిగిన సస్పెన్షన్లే కావడం విశేషం.

ఒక జిల్లాలో పది రోజుల వ్యవధిలో ఓ ఎస్పీ 50 మందికి పైగా సొంత సిబ్బంది మీద సస్పెన్షన్ వేయడం అంటే సంచలనం కాక మరేమవుతుంది?

మొదట మంత్రి బాలినేని సొంత నియోజకవర్గం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్‌ పై వేటు వేశారు ఎస్పీ. పోలీస్ స్టేషన్లలో సివిల్ పంచాయతీలు, ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో సీఐపై వేటు పడింది.

తర్వాత కొన్ని రోజులకు, ఆగస్టు 28న అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడ్డారని, ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఏకంగా 38 మంది పోలీస్ సిబ్బందిని ఒకే రోజు ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం రేపింది.

అంతే కాక వీరిపై విచారణ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆరోపణలు నిజమని తేలితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించడం చర్చనీయాంశమైంది.

సస్పెండైన పోలీసుల వివరాలు, వారిపై వచ్చిన ఆరోపణలను మీడియాకు రిలీజ్ చేయడం పోలీసు విభాగంలో కలకలం రేగింది. దీంతో ఎస్పీ మీద సొంత డిపార్ట్‌మెంట్లో వ్యతిరేక స్వరాలు పెరిగిపోయాయి.

మరో వైపు సరిగా పని చేయని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సిబ్బందిని ఎస్పీ బదిలీ చేశారు. ఇలాంటి వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. ఓ ఎస్పీ ఇంత దూకుడుగా, నిక్కచ్చిగా వ్యవహరించడం సినిమాల్లోనే చూస్తుంటాం. ఈ నేపథ్యంలో పలువురు మంత్రి బాలినేని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా.. ఆయన ఎస్పీతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.