వైసీపీ ఇన్ చార్జిల మూడో జాబితా ఇదే

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ వైసీపీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సర్వేల నివేదికలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తొలగిస్తూ వారి స్థానంలో కొత్త వారికి జగన్ చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే చీటింగ్ స్థానాలు కోల్పోయిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారు. మరికొందరు ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పునకు సంబంధించి మూడో జాబితాను వైసీపీ అధిష్టానం ఈ రోజు విడుదల చేసింది.

మొత్తం 21 మంది వైసీపీ నేతలకు మూడో జాబితాలో స్థానచలనం కలిగింది. ఇందులో 6 ఎంపీ స్థానాలు ఉండగా, 15 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఈ మొత్తం జాబితాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని హైలైట్ గా నిలిచారు. వైసీపీ తీర్థం పుచ్చుకోక ముందే ఆ పార్టీ తరఫున విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని నాని బరిలోకి దిగిబోతున్నట్లుగా వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. కేశినేని నాని రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఇంకా ఆమోదించలేదు. ఇక, టీడీపీ సభ్యత్వానికి చేసిన రాజీనామా కూడా ఆమోదించలేదు. టెక్నికల్ గా ఆయన వైసీపీలో చేరలేదు. ఇటువంటి సందర్భంలో కేశినేనిని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం విశేషం.

మరోవైపు, మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సిని విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. ఇక, తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి షాక్ ఇస్తూ అక్కడ కోనేటి ఆదిమూలం పేరును జాబితాలో చేర్చారు. గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్ సభ స్థానం ఇన్చార్జిగా నియమించారు. మంత్రి జోగి రమేష్ కు కూడా జగన్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందిన జోగి రమేష్ ను ఈసారి పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ నియమించారు. తాజాగా, మూడో జాబితా కూడా విడుదల నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

21 మంది ఇన్చార్జిల జాబితా….

లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జిలు

శ్రీకాకుళం – పెరాడ తిలక్
విశాఖపట్నం -బోత్స ఝాన్సీ లక్ష్మీ
ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ – కేశినేని నాని
కర్నూలు – గుమ్మనూరి జయరాం
తిరుపతి – కోనేటి ఆదిమూలం

అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జిలు

ఇచ్చాపురం – పిరియ విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి -కంభం విజయ రాజు
రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
దర్శి – బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతల పట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు – విజయానందరెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
రాజంపేట -ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు – బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ ) -మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేష్
పెడన – ఉప్పాల రాము

శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.