మాధవ్ కు మొండిచెయ్యేనా ?

చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఈ సామెత హిందుపురం వైసీపీ ఎంపీ మాధవ్ కి సరిగ్గా సరిపోతుంది. పోలీసు అధికారిగా పనిచేస్తున్న మాధవ్ జేసీ బ్రదర్స్ తో జరిగిన ఒక గొడవలో సడెన్ గా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డారు. దాంతో పోలీసులు ఉద్యోగానికి రాజీనామా చేయటం, వైసీపీ తరపున హిందుపురం ఎంపీగా పోటీచేసి గెలవటం అంత చాలా స్పీడుగా జరిగిపోయింది. పోలీసు నుండి ప్రజాప్రతినిధిగా మారిపోయిన మాధవ్ అందుకు మానసికంగా సిద్ధమైనట్లు కనబడలేదు.

ఎందుకంటే పోలీసు అధికారిగానే వ్యవహరించారు. ఎదుటివాళ్ళపైన నోరుపారేసుకోవటం, దురుసుగా వ్యవహరించటంతో వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పుడు చుట్టుముట్టిన వివాదాలు ఎంపీతో అలా ప్రయాణం చేస్తునే ఉన్నాయి. కానిపనులు చేసి ఎంపీగా ఎక్కడా ఇరుక్కోలేదు కాని వ్యక్తిగత ప్రవర్తనే బాగా వివాదాస్పదమైంది. దాంతో మాధవ్ అంటేనే వివాదాస్పద నేత అనే ముద్రపడిపోయింది. అందుకనే రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్ళీ మాధవ్ కి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనే ప్రచారం పెరిగిపోయింది.

జరిగిన ప్రచారానికి తగ్గట్లుగానే పార్టీలో జరుగుతున్న మార్పుల్లో భాగంగా హిందుపురం ఎంపీ సమన్వయకర్తగా జోలధరాశి శాంతను నియమించారు. ఎంపీగా కాకుండా మాధవ్ కు కర్నూలు జిల్లాలో ఎంఎల్ఏగా పోటీచేయించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారం ఉత్త ప్రచారంగా మాత్రమే మిగిలిపోయేట్లుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న మార్పుల్లో కూడా మాధవ్ ను ఎక్కడా సమన్వయకర్తగా నియమించలేదు. భవిష్యత్తులో ఏమన్నా నియమిస్తారేమో తెలీదు. అయితే దీనికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పార్టీవర్గాల సమాచారం.

ఎంపీ టికెట్ ఇచ్చి జగన్ గెలిపించుకున్నా ఆ హోదాను మాధవ్ నిలుపుకోలేకపోయారు. వివాదాలకు దూరంగా ఉండుంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీగా మళ్ళీ టికెట్ గ్యారెంటీగా ఉండేదనటంలో సందేహంలేదు. అయితే నోటి దరుసు, పోలీసు అధికారిననే దర్పాన్ని ఎంపీ విడవలేకపోయారు. ప్రజాప్రతినిధిగా ఓర్పుగా ఉండాలని, రెగ్యులర్ గా జనాల్లో ఉండాలన్న విషయాన్ని మాధవ్ మరచిపోయారు. అందుకనే ఎంపీగా ఇప్పటికైతే మొండిచెయ్యి ఎదురైందనే చెప్పాలి. మరి భవిష్యత్తు ఎలాగుంటుందో చూడాలి.