వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆరవ్ చిన్న పిల్లాడని, తెలియక యాక్సిడెంట్ చేస్తే క్రిమినల్ కేసు పెడతారా అంటూ జగన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
ఇక, ఈ కేసు నుంచి తన కుమారుడు ఆరవ్ ను తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించేందుకు సాక్షాలు తారుమారు చేశారని ఆరోపణలు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో అప్పల రాజును జూలై 22న పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అప్పల రాజుకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
23 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా సబ్ జైల్లో అప్పల రాజు రిమాండ్ లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ విచారణకుకు వచ్చింది. అయితే, ఆ బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు వాయిదా వేస్తూ వచ్చింది. అప్పల రాజును విచారణ జరిపేందుకు కాశీబుగ్గ పోలీసులు కస్టడీ కోరగా గతంలో కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ రోజు బెయిల్ మంజూరు కావడంతో అప్పల రాజుకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది.
ఈ ఏడాది జూలై 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై ఆరవ్ తన బైక్ నడుపుతూ దానయ్య అనే గొర్రెల కాపరిని ఢీకొట్టాడు. ఆ దుర్ఘటనలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్ కేసు నుంచి ఆరవ్ ను తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ఆరవ్ ను కాపాడుకునేందుకు తన అనుచరుడైన సిద్ధార్థ్ ను అప్పలరాజు బలి చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.
అయితే, ఈ యాక్సిడెంట్ జరగడానికి ముందు వేరే పెట్రోల్ బంకులో ఆరవ్ తన బైక్లో పెట్రోల్ నింపుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో ఆరవ్ దొరికిపోయారు. కానీ, తానే ఆ యాక్సిడెంట్ చేశానని పోలీసుల ముందు సిద్ధార్థ్ లొంగిపోయేలా అప్పలరాజు నాటకం ఆడించారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం, బాధితుడి కుటుంబంపై ఒత్తిడి తేవడం వంటి అభియోగాలతో అప్పలరాజును ఈ కేసులో ఏ3గా చేర్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates