పెన‌మ‌లూరులో బోడేదే పైచేయి…!

పార్టీ ఒక‌టే కానీ.. అంత‌ర్గ‌త కూట‌ములు చాలానే ఉన్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గం స్పెష‌ల్ అదే. ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల్లోనూ నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాలు ఉన్నా.. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఇవి మ‌రింత భిన్నంగా ఉంటున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నాయ‌కులు వ‌ర్గాలుగా విడిపోయి.. మండ‌లాల‌ను పంచేసుకున్నారు. ఫ‌లితంగా ఎగ‌స్పార్టీ పెరిగి.. పార్టీలో ఐక్య‌త స‌న్న‌గిల్లి ఓట‌మికి దారితీసింది. బ‌ల‌మైన టీడీపీ కంచుకోటగా గుర్తింపు ఉన్నా.. గెలుపులో వెనుక‌బ‌డింది.

ఈ ద‌ఫా అలాంటి ప‌రిస్థితి రాకుండా.. ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వ‌ర్గ‌పోరును ఎక్క‌డిక‌క్క‌డే తగ్గించుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఒక‌ప్పుడు పార్టీలో నాయ‌కుల‌కు ఆయ‌న‌కు విభేదాలు కొన‌సాగ‌గా.. ఇప్పుడు తానే స్వ‌యంగా నాయ‌కుల‌కు చేరువ అవుతున్నారు. ఎవ‌రో రావాలి.. అని ఎదురు చూడ‌కుండా.. వారి చెంత‌కు ఆయ‌నే వెళ్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మ‌మైనా.. ప‌ర్స‌న‌ల్ కార్య‌క్ర‌మ‌మైనా నాయ‌కుల ఇళ్ల‌కు వెళ్తున్నారు. త‌ద్వారా ఆయ‌న వ్య‌క్తిగ‌త గ్రాఫ్‌ను పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఉమ్మ‌డి విజ‌యం

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మంలో ఉమ్మ‌డిగా నాయ‌కుల‌ను ముందుకు తీసు కువెళ్ల‌డంలో బోడే స‌క్సెస్ అయ్యారు. ఒక‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కానూరు మండ‌లంలో సై అన్న నాయ‌కులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటు క‌లిసిముందుకు సాగుతున్నారు. అలానే.. బీజేపీ, జ‌న‌సేన‌లో ఉన్న కొద్ది మంది నాయకుల‌ను కూడా క‌లుపుకొని ముందుకు వెళ్తున్నారు. భేష‌జాల‌కు అవ‌కాశం లేకుండా.. బోడే వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంత‌ర్గ‌త వివాదాల‌కు తావు లేకుండా సాగేలా చేస్తోంది.

మ‌రోవైపు.. వైసీపీకి పెన‌మ‌లూరులో బ‌ల‌మైన నాయ‌కులు లేకుండా పోయారు. గ‌తంలో కొలుసు పార్థ‌సార‌థి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. ఆయ‌న వ‌ర్గాల‌ను మెయింటెన్ చేశార‌న్న వాద‌న ఉంది. అదే వ‌ర్గ పోరు వైసీపీని ఇబ్బంది పెట్టింది. ఈ పోరు ఇంకా కొన‌సాగుతోంది. దీనికి తోడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ఈ విష‌యం తేల‌క‌పోవ‌డంతో జెండా ప‌ట్టుకునేవారు.. పార్టీవాయిస్ వినిపించేవారు లేక పోవ‌డం కూడా టీడీపీ ఎమ్మెల్యేకు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారి.. బోడేదే పైచేయిగా ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది.