టీడీపీ,జనసేనను వదులుకునే ధైర్యం చేయలేకపోతున్నారు

గురువారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ పొత్తులపై తన అభిప్రాయాన్ని ఫైనల్ చేసిందా ? కమలనాథులు ఇచ్చిన సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికలు, పార్టీ పరిస్ధితి, పొత్తుల వ్యవహారం, అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించేందుకు బీజేపీ కోర్ కమిటి నేతలు చర్చలు జరిపారు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో మెజార్టీ నేతలు పొత్తులుండాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు పెరుగుతాయేమో కానీ సీట్లు మాత్రం రావని సమావేశం అభిప్రాయపడింది.

ఇప్పటికే జనసేనతో పొత్తున్నా అది ప్రాక్టికల్ గా అమల్లో లేదన్న విషయాన్ని కూడా సమావేశం చర్చించింది. జనసేన అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో చేతులు కలిపిన విషయంపైన కూడా సమావేశం చర్చించింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ ఇప్పటికే అనేకసార్లు అగ్రనేతలకు సూచించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ గనుక టీడీపీతో పొత్తుకు ఇష్టపడకపోతే జనసేన ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళటం ఖాయమని సమావేశం అభిప్రాయపడింది.

అప్పుడు బీజేపీ ఒంటరి పోరాటం తప్పదని సమావేశంలో పలువురు తేల్చేశారు. అదేదో టీడీపీతో పొత్తు విషయాన్ని అగ్రనేతలు ఎంత తొందరగా ఫైనల్ చేస్తే ఎన్నికల్లో పోటీపై తమకు అంత క్లారిటి వస్తుందని కోర్ కమిటి సభ్యులు ఢిల్లీ నుండి ప్రతినిధిగా వచ్చిన శివప్రకాష్ కు స్పష్టంచేశారు. నేతల నుండి విడివిడిగా అభిప్రాయాలు తీసుకున్నపుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని మెజార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారట. నేతల అభిప్రాయాలను శివప్రకాష్ విడిగా తీసుకుని సీల్డ్ కవర్లో పెట్టుకున్నారు.

రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మొదటి నుండి టీడీపీతో పొత్తుకే మొగ్గుచూపుతున్న విషయం అందరికీ తెలిసిందే. పురందేశ్వరి కాకుండా మరికొందరు నేతలు కూడా పదేపదే టీడీపీతో పొత్తుండాలనే చెబుతున్నారు. టీడీపీతో పొత్తులో ఐదు పార్లమెంటు సీట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఒక జాబితా కూడా రెడీ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. రాజమండ్రి, విజయవాడ, రాజంపేట, నరసాపురం, అరకు లేదా తిరుపతి లోక్ సభ సీట్లలో పోటీకి బీజేపీ కీలకనేతలు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.