ఏపీ కాంగ్రెస్..లీడర్ ఓకే..కేడర్ వీకే!

కాంగ్రెస్ పార్టీ…భారత దేశంలో ఘన చరిత్ర కలిగిన గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ…దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సెక్యులర్ పార్టీ గత దశాబ్దకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా ఏపీ, తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులను చవిచూసింది. కానీ, 2004-2014 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అంటూ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలిగింది.

హఠాత్తుగా 2009లో వైఎస్ మరణించడం, 2014లో ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇరు తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, 175 స్థానాల్లో 10 స్థానాలలోపు మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్లు దక్కాయి అంటే ఏపీలో కాంగ్రెస్ ఎంత గడ్డు కాలాన్ని ఎదుర్కొందో చెప్పవచ్చు. ఇక, 2019లో వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో కాంగ్రెస్ దాదాపుగా నామరూపాలు లేకుండా పోయిందని చెప్పవచ్చు. గతంలో దేశవ్యాప్తంగానే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాలలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనామక పార్టీగా మిగిలిపోయింది.

తన ఉనికే ప్రశ్నార్థకంగా చేసుకుంది. మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా పేరున్న వారికి సైతం 2019లో నోటా కంటే తక్కువ ఓట్లు పోలైన దుస్థితి. అంటే, అప్పట్లో కాంగ్రెస్ పేరు ఎత్తడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపడలేదని అర్థమవుతుంది. మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు, మరో కేంద్ర మంత్రి చింతా మోహన్, కాంగ్రెస్ సీనియర్ నేత సాకే శైలజనాథ్ ఇలా పేరుపొందిన నేతలు సైతం రాష్ట్ర విభజన ఆగ్రహాజ్వాలలకు బలి కావాల్సి వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు వచ్చి స్వయంగా ప్రచారం చేసినా కూడా ఫలితం దక్కలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక, మూడు వంతుల మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరగా మిగిలిన వారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పొరుగు రాష్ట్రం ఏపీపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తోంది. అందులోనూ 2004కు ముందు ఏపీలో వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ ను బతికించి అధికారాన్ని కట్టబెట్టిన వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల రూపంలో ఏపీకి చెందిన బలమైన ఇమేజ్ ఉన్న నేతను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని తిరిగి పార్టీని బతికించుకోవాలని చూస్తోంది.

కానీ, గత ఎన్నికలలో 151 సీట్ల అఖండ మెజారిటీతో గెలుపొందిన వైఎస్ జగన్ ఒకవైపు…45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, జనంలో చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ వంటి నాయకులు మరోవైపు అధికారం కోసం పోటీ పడుతున్న తరుణంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా చోటు లేదని చెప్పాలి. అయితే, వైసీపీ నుంచి టికెట్ దక్కని కొందరు నేతలు…టీడీపీ, బీజేపీలోకి వెళ్లడం ఇష్టం లేని మరికొందరు నేతలు తమ రాజకీయ అస్థిత్వం కోసం కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత పదేళ్లుగా కేడర్ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఒకవేళ షర్మిల ఏపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టినప్పటికీ అనూహ్యమైన మార్పులు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. ఏపీలో ‘గ్రేస్’, సాలిడ్ కేడర్ బేస్ లేని కాంగ్రెస్ బాస్ లా మారడం చాలా కష్టం! అధిష్టానం ఆదేశిస్తే ఏపీ కాంగ్రెస్ కు షర్మిల రూపంలో లీడర్ దొరికినా..కేడర్ ఏది? అన్న భేతాళ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం కష్టం!