నారా ఫ్యామిలి ఫుల్లు బిజీనా ?

ఒక్కసారిగా నారా ఫ్యామిలి ఫుల్లు బిజీ అయిపోయింది. బహిరంగసభలతో చంద్రబాబునాయుడు, నియోజకవర్గం పర్యటనతో లోకేష్, నిజం గెలవాలని పరామర్శయాత్రతో భువనేశ్వరి యాక్టివ్ అయిపోయారు. ఈనెల 5వ తేదీనుండి 29వ తేదీవరకు వరుసగా చంద్రబాబు బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు. అంటే 24 రోజుల్లో 25 బహిరంగసభల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. మధ్యలో ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. అందుకనే ఒకేరోజు రెండు మూడు బహిరంగసభలను కూడా ప్లాన్ చేశారు. ఏరోజు ఎక్కడ బహిరంగ సభలను నిర్వహించబోతున్న విషయాన్ని ఇప్పటికే తమ్ముళ్ళకు షెడ్యూల్ కూడా విడుదలచేశారు.

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మొదలయ్యే బహిరంగసభల షెడ్యూల్ అనంతపురం బహిరంగసభతో ముగుస్తుంది. అలాగే ఒకటి రెండు రోజుల్లో లోకేష్ మంగళగిరిలో పర్యటనలు పెట్టుకోబోతున్నారు. సంక్రాంతి పండుగవరకు నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో పర్యటించబోతున్నారు. స్ధానిక నేతలు, క్యాడర్ తో మండలాల వారీగా సమీక్షలు జరపబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో లోకేష్ పర్యటనలు ఫిక్స్ చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా గెలవకపోతే భవిష్యత్తు అయోమయంలో పడిపోవటం ఖాయం.

ఇక చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక కొందరు అభిమానులు, మద్దతుదారులు మరణించారు. ఆ కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించేందుకే అప్పట్లో నిజంగెలవాలి అనే స్లోగన్ తో యాత్రలు పెట్టుకున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు నాలుగైదు ఫ్యామిలీలను కలిసి పరామర్శించి తలా రు. 3 లక్షల విలువైన చెక్కులను అందించారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో కొన్ని కుటుంబాలను కలిసిన తర్వాత చంద్రబాబు బెయిల్ పైన బయటకొచ్చేశారు.

చంద్రబాబుకు బెయిల్ దొరికింది కాబట్టి భువనేశ్వరి యాత్రలను నిలిపేశారు. ఆగిపోయిన భువనేశ్వరి యాత్రలపై వైసీపీ బాగా సెటైర్లు వేసింది. మరి అందుకనో లేకపోతే ఇంకేదైనా కారణమో తెలీదు కాని భువనేశ్వరి నిజంగెలవాలని టూర్ ను మళ్ళీ పట్టుకున్నారు. మూడురోజులు ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని బాధిత కుటుంబిలను పరామర్శించబోతున్నారు. తలా రు. 3 లక్షల చెక్కులను అందిస్తారు. 6వ తేదీ సాయంత్రానికి విశాఖపట్నం నుండి హైదరాబాద్ చేరుకుంటారు. కొద్దిరోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ పర్యటన ఉంటుందని పార్టీవర్గాలు చెప్పాయి.