కేటీయార్ దుమ్ము దులిపేస్తున్నారా ?

ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీయార్ ను నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు. ఓడిపోయినా ఇంకా కేటీయార్లో అహంకారం తగ్గలేదా అంటు మండిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఏదో సమావేశంలో కేటీయార్ మాట్లాడుతు కేసీయార్ 32 మెడికల్ కాలేజీలను పెట్టేబదులు 32 యూట్యూబ్ ఛానళ్ళను ఏర్పాటుచేసుకునుంటే బీఆర్ఎస్ మళ్ళీ గెలిచేదన్నారు. అంటే ఏ ఉద్దేశ్యంతోనే కేటీయార్ ఈ మాటలన్నారో అర్ధంకావటంలేదు. కారణం ఏమిటంటే ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ తక్కువేమీ జరగలేదు.

పైగా ప్రచారం కూడా పాజిటివ్ గా నే జరిగింది. కేసీయార్ లేదా బీఆర్ఎస్ పైన నెగిటివ్ గా ప్రచారం చేయాలంటేనే మెజారిటి మీడియా వణికిపోయింది. నెగిటివ్ ప్రచారమంటే ఉన్నదున్నట్లుగా కవర్ చేయటానికి కూడా మీడియా భయపడిపోయింది. ఇదే సమయంలో ఎన్నికల ముందుకాని, ఎన్నికల్లో కానీ పూర్తి పాజిటివ్ ప్రచారమే జరిగింది. దీనికి అదనంగా బీఆర్ఎస్ నేతలకే సొంత మీడియా ఉంది. ఇది సరిపోదన్నట్లుగా బీఆర్ఎస్ కు మద్దతుగా సోషల్ మీడియా విపరీతంగా ప్రచారంచేసింది.

ఇంత పాజిటివ్ ప్రచారం చేసుకున్నా జనాలు బీఆర్ఎస్ ను ఓడగొట్టారు. ఆ అక్కసు కేటయార్లో చాలా బలంగా ఉన్నట్లుంది. అందుకనే మెడికల్ కాలేజీలను పెట్టేబదులు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకునుంటే సరిపోయేదన్నారు. దానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో కేటీయార్ ను దుమ్ము దులిపేస్తున్నారు. బీఆర్ఎస్ ఓడిపోయింది యూట్యూబ్ ఛానళ్ళు లేకో లేకపోతే ప్రచారం తక్కువయ్యో కాదన్నారు. కేసీయార్, కేటీయార్, కవిత, హరీష్ రావుల అహంకారమే పార్టీని ఎన్నికల్లో ఓడించినట్లు కేటీయార్ కు డైరెక్టుగానే తలంటిపోసి మరిచెప్పారు.

పదేళ్ళపాలనలో పెరిగిపోయిన అహంకారం, అవినీతి, అరాచకాలను జనాలు భరించలేకపోయినట్లు నెటిజన్లు కేటీయార్ కు సూటిగానే చెప్పారు. అధికారంలో ఉన్నపుడంటే అహంకారం పెరిగిపోయినా ఓటమి తర్వాత కూడా అహంకారం తగ్గలేదా ? అంటు సూటిగా కేటీయార్ ను నిలదీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడైనా జాగ్రత్తగా మెలగాలని, అహంకారాన్ని విడిచి వాస్తవంలో బతకమని గడ్డిపెడుతున్నారు. ప్రజావ్యతిరేక పాలన వల్లే జనాలు ఓడించారు కానీ బీఆర్ఎస్ కు ప్రచారం తక్కువైకాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీయార్ ను నెటిజన్లు వాయించేస్తున్నారు.