చంద్రబాబు, పవన్ కలిసి 22 సభలకు ప్లాన్!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నాహాలు మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జనవరి 5వ తేదీ నుంచి చంద్రబాబు ‘రా… కదలిరా’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘రా… కదలిరా’ పోస్టర్లలో టీడీపీ సైకిల్, జనసేన గ్లాసు గుర్తులు పక్కపక్కనే ముద్రించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగానే జనవరి 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఈ రకంగా ప్రజల ముందుకు వస్తున్నారు. చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ప్రజలలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు భవిష్యత్ కార్యక్రమాల గురించి అచ్చెన్నాయుడు వివరించారు. ‘రా…కదలి రా’ షెడ్యూల్ ను చంద్రబాబు ప్రకటించారు. ఈ  నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నామన్నారు. రోజుకు 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. టీడీపీ–జనసేన కలిసే సభల్ని నిర్వహిస్తున్నాయని, చంద్రబాబుతో పాటు, పవన్ కల్యాణ్ కూడా కొన్ని సభలకు హాజరవుతారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

ప్రజలు ఈ సభలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తమ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని పలువురు నేతలు కోరుతున్నారని చెప్పారు. సమయా భావం వల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యామన్నారు. టీడీపీ స్థాపించడానికి ముందు కంటే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నామని, ఆ పరిస్థితులను చక్కదిద్దాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమని అన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభల వివరాలు

జనవరి 5: ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో సభ

జనవరి 6: విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంట.

జనవరి 9: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డ.

జనవరి 10: విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని.

జనవరి 18: స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్థంతి నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీస్థాయిలో సభ

జనవరి 19: చిత్తూరు పార్లెమంట్ పరిధిలోని జీడీ నెల్లూరు,  కడప పార్లమెంట్ పరిధిలోని కమలాపురం

జనవరి 20: అరకు పార్లమెంట్ పరిధిలోని అరకులో,  అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేట.

జనవరి 24: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉవరకొండలో సభ

జనవరి 25: నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండ అసెంబ్లీలో.

జనవరి 27: రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ లోని పొన్నూరు అసెంబ్లీలో.

జనవరి 28: అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో..

జనవరి 29: ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలో చీరాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు