ఎంతెంత దూరం.. వైసీపీ బ్యాడ్ అవుతోంది ఇక్క‌డే!

ఏ నాయ‌కుడైనా.. చేజేతులా పార్టీని నాశ‌నం చేసుకుంటారా?  నాయ‌కుల‌ను వ‌దులు కుంటారా?  అంటే.. కాద‌నే చెప్పాలి. ఎందుకంటే.. పార్టీ అంటే.. జెండాలు, క‌ర్ర‌లు, నినాదాలే కాదు.. నాయ‌కులు!  కార్య‌క‌ర్త‌లు. ఈ రెండు లేకుండా ఎన్ని జెండాలు క‌ట్టినా.. ఎన్ని నినాదాలు ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేదు. ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఇలానే మారిపోయింది. నాయ‌కుల‌ను దూరం చేసుకుంటున్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను కాద‌నే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఒక‌ప్పుడు… లోట‌స్ పాండ్‌లో పార్టీ కార్యాల‌యం ఉంటే.. నేరుగా కార్య‌క‌ర్త‌లు వెళ్లేవారు.

నాయ‌కుల వెంట కార్య‌క‌ర్త‌లు ఉండేవారు. కానీ, ఇప్పుడు అడుగ‌డుగునా నిర్బంధాలు. నాయ‌కుల‌తో కార్య‌క‌ర్త‌లు లేరు. ఉన్నా.. వారు గేటు వ‌ర‌కే ప‌రిమితం. ఫలితంగా.. పార్టీకి  దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, నాయ‌కుల్లోనూ అసంతృప్తి పేరుకుంది. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం మానేయ‌డం.. కేవ‌లం బ‌ట‌న్ నొక్కుళ్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం.. అధినేత‌ను క‌లిసేందుకు అనేక గేట్లు పెట్టేయ‌డం.. కార‌ణాలు చెప్పాలంటూ.. హుకుం జారీ చేయ‌డం వంటివి పార్టీని సంస్థాగ‌తంగా నాశ‌నం చేస్తున్న ప్ర‌ధాన అంశాలు.

నేనున్నాను.. నేను విన్నాను.. అని చెప్పిన జ‌గ‌న్‌.. త‌న పార్టీ విష‌యానికి వ‌స్తే.. ఎవ‌రికి ఆయ‌న మ‌ద్ద‌తు ఉందో.. ఎవ‌రి మాట ఆయ‌న వింటున్నారో.. ఆయ‌నకే తెలియాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రెండు రోజుల కింద‌ట కీల‌క నాయ‌కుడు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్లాస్ట్ అయిపోయారు. జ‌గ‌న్‌ను మేం అభిమానిస్తున్నాం.. కానీ, ఆయ‌న కూడా అభిమానించాలి గా! అని చెప్పేశారు. క‌ట్ చేస్తే.. తాజాగా ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్నారెడ్డి రాజీనామా!

ఈ ప‌రిణామాలు ఇప్ప‌టికి ఆగేలా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎవ‌రిని క‌దిలించినా.. ఎవ‌రిని ప్ర‌శ్నించినా.. అసంతృప్తి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎవ‌రూ ప్ర‌శాంతంగా లేదు. ఎవ‌రూ సంతృప్తిగా కూడా లేరు. ఈ ప‌రిణామాల‌తో 2014,2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని.. కోరుకున్న‌వారు.. ఆయ‌న అధికారంలోకి రావాల‌నుకున్న‌వారే.. ఇప్పుడు ఆయ‌న‌కు దూరంగా జ‌రుగుతున్నారు. నాయ‌కుడు ఎంత బ‌లంగా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో బ‌లం కూలిపోతే.. మొత్తానికే ప్ర‌మాద‌మ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.