టీడీపీపై ‘హిమాల‌య‌’మంత అభిమానం!!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ జెండా హిమాల‌యాల‌పై రెప‌రెప‌లాడింది. ఆ పార్టీ ప‌ట్ల త‌మ అభిమానం హిమాల‌య‌మంత అని యువ‌త చాటుకున్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన యువ‌త‌.. ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వ‌తారోహణం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు అనేక క‌ష్టాలు ప‌డి(శీతాకాలం కావ‌డంతో) ప‌ర్వతాన్ని చేరుకున్నారు.

సాధార‌ణంగా.. ఇలాంటి అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన‌ప్పుడు దేశ‌భ‌క్తిని చాటుకుంటూ.. జాతీయ జెండాను రెప‌రెప‌లాడించ‌డం ప‌రిపాటి. అయితే..దేశ భ‌క్తితో పాటు తెలుగు దేశం ప‌ట్ల ఉన్న అభిమానం కూడా.. వారు చాటుకున్నారు. మిమాల‌య పర్వ‌తంపై టీడీపీ జెండాను ఎగ‌రేసి.. పార్టీ అధికారంలోకి రావాల‌ని కోరుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం జడ్‌. ఉప్పలపాడుకి చెందిన యువకులు సోమినేని నరేష్‌, సోమినేని మనోహర్‌, కోటపాటి శ్రీకాంత్‌లు హిమాలయ యాత్ర‌కు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా వారు తమ వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావుల ఫొటోలతో ముద్రించిన జెండాను తీసుకెళ్లారు. తొలుత హిమాల‌యం అధిరోహించ‌గానే.. భారత దేశ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం.. తెలుగు దేశం పార్టీ జెండాను రెప‌రెప‌లాడించారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని, అధికారంలోకి రావాల‌ని, అదేవిధంగా కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెల‌వాల‌ని ఆకాక్షించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌, నాగేశ్వ‌ర‌రావు విజ‌యం సాధించాక తిరిగి ఇదే హిమాలయాలపై వేడుక జరుపుకుంటామని వారు తెలిపారు. కాగా, కందుకూరు యువ‌కుల స్ఫూర్తి చూశాక‌.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాల‌న్న కాక్ష యువ‌తలో ఎంత ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు.