అనుకున్నంతా జరిగిందా ? ఘోర ఓటమి

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనుకున్నంతా జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఘోరంగా ఓడిపోయింది. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని చాలా రోజులు టీబీజీకేఎస్ ఊగిసలాడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభావం తప్పకుండా సింగరేణి ఎన్నికలపైన కూడా పడుతుందని కేసీయార్ భావించారు. సింగరేణి ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని భయపడ్డారు. అందుకనే సింగరేణి ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు కూతురు కవిత ద్వారా ప్రకటన చేయించారు.

అయితే తెరవెనుక ఏమైందో ఏమో 24 గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. సింగరేణి ఎన్నికల్లో అనుబంధం సంఘం పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రకటించినట్లే టీబీజీకేఎస్ సింగరేణి గనులకు సంబంధించిన 11 ఏరియాల్లోను పోటీచేసింది. అయితే ఏ ఏనియాలో కూడా గెలవలేదు. మొత్తం 11 ఏరియాల్లో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయుసీ 5 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్ టీయుసీ 6 చోట్ల గెలిచింది. అయితే వచ్చిన ఓట్ల ప్రాతిపదికగా ఏఐటీయూసీనే సింగరేణి మేనేజ్మెంట్ గుర్తింపు సంఘంగా ప్రకటించింది.

ఏఐటీయూసీ కన్నా ఐఎన్ టీయూసీ ఒక ఏరియా అధికంగా గెలిచింది. అయితే ఐఎన్ టీయూసీ గెలిచిన ఏరియాలన్నీ చిన్నవి కావటంతో కాంగ్రెస్ అనుబంధ సంఘానికి పడిన ఓట్లు కూడా తక్కువే. ఐఎన్టీయూసి గెలిచిన ఏరియాలు కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, ఆర్డీ 3, కార్పొరేషన్లలో పడిన ఓట్లు తక్కువ. ఇదే సమయంలో ఏఐటీయూసీకి బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, ఆర్డీ 1, ఆర్డీ2 ఏరియాల్లో పోలైన ఓట్లు ఎక్కువ. పోలైన ఓట్ల ప్రాతిపదికగా ఏఐటీయూసీనే యాజమాన్యం గుర్తింపు సంఘంగా ప్రకటించింది.

ఇక్కడ గమనించాల్సిన ఏమిటంటే ఐఎన్టీయూసీ గెలిస్తే కాంగ్రెస్ బలపడుతుందన్న ఆలోచనతో టీబీజీకేఎస్ కూడా ఏఐటీయూసీకే ఓట్లే వేయించిందట. అంటే సీపీఐ అనుబంధ సంఘంను గెలిపించేందుకు బీఆర్ఎస్ అనుబంధం సంఘం సూసైడ్ పద్దతిని అవలంభించిందని అర్ధమైపోతోంది. అయితే బీఆర్ఎస్ అనుబంధం సంఘం మరచిపోయిన విషయం ఏమిటంటే కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తుందని. అవసరమైతే రెండు యూనియన్లు ఏకతాటిపై నడుస్తాయన్న విషయాన్ని బీఆర్ఎస్ మర్చిపోయినట్లుంది. ఏదేమైనా ముందునుండి అనుమానించినట్లుగానే బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి ఘోర ఓటమి అయితే తప్పలేదు.