“ప‌వ‌న్ ఆ ఒక్క మాట చెబితే.. వైసీపీ ఖాళీ అవుతుంది”

“జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే సీఎంన‌ని ప్ర‌క‌టిస్తే.. విశాఖ‌ప‌ట్నం వైసీపీ నాయ‌కులు మొత్తం వ‌చ్చి జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీగా ఉన్నారు” అని వైసీపీ నుంచి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్న‌ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న పవన్‌ కల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. “వైసీపీలో చేరకముందే నేను పవన్ కల్యాణ్‌కు అభిమానిని. పవన్ ఆలోచనలు నచ్చి నేడు జనసేనలో చేరాను. నేను నా సొంత పార్టీలోకి వచ్చాననే ఆనందం ఉంది” అని వ్యాఖ్యానించారు.

గతంలో ప్రజారాజ్యంలో ప‌నిచేసిన వంశీ కృష్ణ‌.. యువరాజ్యం అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రించిన‌ పవన్ కళ్యాణ్‌తో క‌లిసి ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న “పవన్ కళ్యాణ్ అంటే అభిమానం నేటికీ ఉంది. నేను వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరాను” అని ప్ర‌క‌టించారు. గతంలో వైసీపీ అభివృద్ది కోసం కష్టపడ్డానని, ఇప్పుడు జనసేన కోసం అదే డెడికేషన్‌తో పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక‌, వైసీపీని వ‌దిలేసేందుకు ఉన్న కార‌ణాల‌ను ప్ర‌స్తావిస్తూ.. “కొన్ని శక్తులు, కొన్ని కారణాల వల్ల వైసీపీని వీడుతున్నాను. నాకు అండ‌గా ఉంటూ నాతో నడిచి వస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఇంకా చాలా మంది జనసేనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే సీఎం అభ్య‌ర్థిగా ఉంటాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాల్సి ఉంద‌ని అన్నారు. దీంతో వారంతా అధికారికంగా పార్టీలోకి వస్తారన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది చాలా మంది ఆకాంక్షగా పేర్కొన్నారు. ఆ కోరిక నెరవేరేలా అందరం కలిసి పని చేస్తామ‌న్నారు. తప్పకుండా జనసేనకు అద్భుతమైన ప్రజాదరణను అందరూ చూస్తార‌ని వ్యాఖ్యానించారు.

వంశీకి అండ‌గా ఉంటాం!

వంశీ కృష్ణ‌కు అండ‌గా ఉంటామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. 2009 నుంచి తనకు వంశీతో పరిచయం ఉందన్నారు. తాను యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి యంగ్ లీడర్‌గా పని చేయడం చూశానన్నారు. మళ్లీ 2023లో ఎమ్మెల్సీగా ఉంటూ జనసేనలో చేరిన వంశీకృష్ణను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు నేడు చాలా మంది కీలక వ్యక్తులుగా మారారన్నారు. వంశీకృష్ణ తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. వైసీపీ పాలన గురించి కాకుండా జనసేన సిద్దాంతాలను నచ్చి వచ్చానని తెలిపారన్నారు. పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు.