2014 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలలో దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఒకటి. అయితే, ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో, కాంగ్రెస్, బీజేపీలు ఆ విషయంపై కేసీఆర్ ను నిలదీశాయి. అయితే, తాము దళితులందరికీ 3 ఎకరాల స్థలం ఇస్తామని చెప్పలేదని, స్థలం లభ్యతను బట్టి ఇస్తామని కేసీఆర్ మాట దాటేశారు. రాష్ట్రంలో స్థలాలు సరిపడినన్న లేవు కాబట్టి ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నది గులాబీ పార్టీ నేతల వాదన. కట్ చేస్తే…తాజాగా తన తండ్రి తరహాలోనే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి పథకం’ కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని ప్రకటించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి భూమి అంటే వ్యాపార లావాదేవీలే అని, కానీ, పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచప్రాణాలని కవిత అన్నారు. పేదల అసైండ్ భూములనే ప్రభుత్వం లాక్కొని ప్రాజెక్టులకు ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ‘మేకవన్నె పులి’ అని, చెప్పేది సామాజిక న్యాయం అయితే, చేసేది ఆటవిక న్యాయమని విమర్శించారు. రేవంత్ రెడ్డి సోదరులు, భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల దోపిడీ, రాక్షస పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆమె ఆరోపించారు.
సుమారు 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుందని, సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం పేదల అసైన్డ్ భూములపై వారికే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, కవిత ఇచ్చిన హామీ ప్రాక్టికల్ గా అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూ పంపిణీ హామీ విషయంలో కేసీఆర్ చేసిన పొరపాటే కవిత చేస్తున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates