తెలంగాణ ఎఫెక్ట్‌.. ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు దారెటు?

ఔను.. మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీలో అన్ని ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. తెలంగాణ‌లో అయినా.. ఏపీలో అయినా.. మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పురుష ఓట‌ర్ల‌తో పొలిస్తే.. ఎక్కువ గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హిళ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని.. ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్నారు. అమ‌లు కూడా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. మ‌హిళ‌లు అధికార పార్టీల‌ను ఆద‌రించ‌లేదు. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో త‌ప్ప‌.. మిగిలిన రాష్ట్రాల్లో మ‌హిళ‌లు ప్ర‌తిప‌క్షాల‌కే జై కొట్టారు.

మరీ ముఖ్యంగా క‌ళ్యాణ ల‌క్ష్మి, డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను మ‌హిళ‌ల కోస‌మే అమ‌లు చేసిన‌.. తెలంగాణ‌లో నూ బీఆర్ ఎస్‌వైపు మ‌హిళ‌లు మొగ్గు చూప‌లేదు. ఈ రాష్ట్రంలో కోటీ 94 ల‌క్ష‌ల మేర‌కు.. మహిళా ఓటు బ్యాంకు ఉండ‌గా.. వీరిలో 72 శాతం మంది ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఓటు షేరింగ్ చూసుకుంటే.. కాంగ్రెస్‌కు ఎక్కువ‌గా వ‌చ్చింది. దీనిని బట్టి తెలంగాణ మ‌హిళ‌లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూప‌లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల‌తో ఏపీలోనూ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది ఆసక్తిగా ఉంది. దీనిపైనే అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు టీడీపీ, జన‌సేన‌.. బీజేపీలు దృష్టి పెట్టాయి. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ అధ్య‌క్షురాలిగా ఉన్న బీజేపీ కూడా.. ఈ ద‌ఫా… మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేలా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇక‌, వైసీపీ మ‌హిళ‌ల‌ను కేంద్రంగా చేసుకుని అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నా.. తెలంగాణ‌లో వ‌చ్చిన ఫ‌లితం త‌ర్వాత‌.. ఆలోచ‌న‌లో ప‌డిపోయింది.

రాష్ట్రంలో మ‌హిళ‌ల ఓట్లు రెండు కోట్ల పైచిలుకు ఉన్నాయి. పురుషుల ఓట్లు.. కోటి 98 లక్ష‌లుగా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లోనూ మ‌హిళ‌ల‌ను కేంద్రంగా చేసుకుని అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం ప‌సుపు-కుంకుమ కార్య‌క్ర‌మాన్ని ఎన్నిక‌ల వేళ అమ‌లు చేసింది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల విప‌క్షానికే జై కొట్టారు.

ఇప్పుడు కూడా ఇదే త‌ర‌హా రాజ‌కీయం తెర‌మీదికి వ‌స్తే.. మ‌హిళా ఓటు బ్యాంకు ఎవ‌రికి అనుకూలంగా ఉంటుందనేది ఆస‌క్తిగా మారింది. తాజాగా వైసీపీ ప్ర‌భుత్వం బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల ఓట్లు ప్ర‌భావితం అవుతున్నాయ‌ని, త‌మ‌కే అనుకూలంగా ఉంటుంద‌ని వైసీపీ టాక్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.