వైసీపీకి జ్యోతుల చంటిబాబు గుడ్ బై?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని టీడీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే . జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఆ క్రమంలోనే 11 మంది సిట్టింగ్ల స్థానాలను మార్చారని టిడిపి నేతలు అంటున్నారు. మరో 70 మంది వరకు సిట్టింగ్లను మార్చే యోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ రాని వైసీపీ నేతలు పక్క పార్టీ వైపు చూస్తున్నారని టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీకి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు షాక్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

త్వరలోనే చంటిబాబు టిడిపిలో చేరబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. ఆల్రెడీ టీడీపీ అధిష్టానంతో చంటిబాబు చర్చలు జరిపారని ప్రచారం సాగుతోంది. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జగ్గంపేట నుంచి పోటీ చేసిన చంటిబాబు ఓడిపోయారు. 2014లో టిడిపి అధికారంలోకి రాగానే ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ గా చంటిబాబును చంద్రబాబు నియమించారు. జగ్గంపేట టికెట్ ఇవ్వలేమని టిడిపి అధిష్టానం చెప్పినప్పటికీ వేరే చోట నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని కూడా చంటిబాబు కోరుతున్నారని తెలుస్తోంది.

అయితే, అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టిడిపి అధిష్టానం చంటిబాబుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. 2024 జనవరి 5,6 తేదీల్లో చంటిబాబు సైకిల్ ఎక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం చంటిబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘‘గాడిద గుడ్డు…పార్టీలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి…ఈ పార్టీలో శాశ్వతంగా ఉంటామా అంటూ చంటిబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఈరోజు ఈ పార్టీలో ఉన్నవారు రేపు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారేమో ఎవరికి తెలుసు అంటూ చంటిబాబు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఆయన టిడిపిలోకి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ కామెంట్లు చేసినట్టుగా తెలుస్తోంది.