వార్నింగ్ ఇస్తున్న రేవంత్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేస్తే వదిలేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్.. వివిధ విభాగాల్లో సమీక్షలపై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ మాత్రం తప్పు దొరికినా, ఎవరైనా తేడాగా ప్రవర్తించినా రేవంత్ మండిపడుతున్నారని తెలిసింది. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసే ఏ అధికారినైనా వదిలి పెట్టేదే లేదని చెప్పారు.

సీఎం అయిన తర్వాత ప్రజా పాలన అందించాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్ వివిధ ప్రభుత్వ విభాగాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడంలో కీలకంగా వ్యవహరించాల్సిన కలెక్టర్లు, ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించే పోలీసు విభాగాలపై రేవంత్ ధ్యాస మళ్లించారు. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పౌరులతో గౌరవంగా ఉండాలి కానీ క్రిమినల్స్ తో కాదని.. గంజాయి, డ్రగ్స్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండొద్దని రేవంత్ అన్నారు. నేరాలు, హత్యలు చేసిన వాళ్లను ఫ్రెండ్స్ గా చూడొద్దని గట్టిగానే చెప్పారు. డ్రగ్స్, గంజాయి మాఫియాను వదలొద్దన్నారు. అంతే కాకుండా సన్ బర్న్ పార్టీకి అనుమతి ఇంకా ఇవ్వకుండానే టికెట్లు ఎలా అమ్ముతున్నారంటూ రేవంత్ ప్రశ్నించారు. దీన్ని బట్టి పోలీసు విభాగంపై రేవంత్ ఎలాంటి ఫోకస్ పెట్టారో తెలుస్తోంది.

మరోవైపు కలెక్టర్లు కూడా జవాబుదారీతనంతో వ్యవహరించాలని రేవంత్ సూచించారు. తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ ను గుర్తు చేసుకుని ఐఏఎస్ లు విధి నిర్వహణలో ఉత్తమంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రజలతో శభాష్ అనిపించుకున్నంతవరకే ప్రభుత్వం అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటారని రేవంత్ అన్నారు. కాదని నిర్లక్ష్యం వహించినా, తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రేవంత్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.