క్లీన్ స్వీప్ జిల్లాల్లో వైసీపీ ప‌రిస్థితేంటి..

2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ.. నెల్లూరు, క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాల‌ను క్లీన్ స్వీప్ చేసింది. అటు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, ఇటు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ విజ‌య ఢంకా మోగించింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ జిల్లాల్లో త‌న ఆధిప‌త్యాన్ని వైసీపీ నిల‌బెట్టుకుంటుందా? అనేది చ‌ర్చ‌నీయంశంగా మారింది. ఎందుకంటే.. ఈ మూడు జిల్లాల్లోనూ మునుప‌టికిఇప్ప‌టికి ప‌రిస్థితి మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నెల్లూరు: 2019లో ఉన్న ఐక్య‌త ఇప్పుడు వైసీపీలో లేదు. పైగా.. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ ణరెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వంటివారు పార్టీ మారిపోయి… బ‌య‌ట‌కువ‌చ్చేశారు. ఇక‌, ఫైర్ బ్రాండ్ గా ఉన్న నాయ‌కులుకూడా.. మౌనంగా ఉన్నారు. జిల్లాల స్థాయిలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కొన‌సాగుతు న్నాయి. మ‌రోవైపు.. టీడీపీకి మ‌రింత బ‌లం పెరిగింది సో.. మొత్తంగా చూసుకుంటే నెల్లూరులో క్లీన్ స్వీప్‌చేయ‌డం అంత తేలిక అయితేకాదని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

క‌డ‌ప‌:  ఇది సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా. 2019లో 10 అసెంబ్లీ స్థానాలు.. స‌హా పార్ల‌మెంటు స్థానాల్లోనూ విజ యం ద‌క్కించుకున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట‌, క‌డ‌ప, రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు క‌ష్ట‌మ‌ని అంటున్నారు. జిల్లాల విభ‌జ‌న‌తో ఇక్క‌డ వైసీపీలో పుట్టిన సెగ‌లు ఇంకా కొన‌సాగుతు న్నాయి. మ‌రోవైపు.. వైఎస్ వివేకా హ‌త్య‌తోపాటు టీడీపీ నేత బీటెక్ ర‌విపైకేసులు.. వంటివి కూడా ప్ర‌భావం చూపుతున్నాయి.

క‌ర్నూలు:  ఈ జిల్లాలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న ఉంది. టీడీపీ ఇప్పుడు ఇక్క‌డ బ‌లంగా ముందుకు సాగుతుండ‌డంతోపాటు.. వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. న్యాయ రాజ‌ధాని అని పేర్కొన్నా ఎలాంటి అభివృద్ధి లేక పోవ‌డంతో క‌ర్నూలు ఓట‌ర్లు ఈ ద‌ఫా గుండుగుత్త‌గా వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతార‌నే విష‌యంలో సందేహాలు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.