ఎమ్మెల్యేల‌కు ఎస‌రు.. ఆశావ‌హుల స‌రికొత్త రాజ‌కీయం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేయాల‌ని భావిస్తున్న ఆశావ‌హులు.. స‌రికొత్త రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై సై అంటే సై అంటూ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటా పోటీ కార్య‌క్ర‌మాలు చేస్తున్నా రు. ఈ క్ర‌మంలో కేసులకు కూడా వెర‌వ‌కుండా ముందుకు సాగుతున్నారు. అయితే.. ఆయా విష‌యాల‌పై స్థానికంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌, వివాదాలు అధిష్టానానికి త‌ల‌నొప్పులు తెస్తున్నాయి.

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇటీవల వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకూ వెళ్లారు. ఎమ్మెల్యే రక్షణనిధికి, నియోజకవర్గంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బరిగెల కోటేష్‌ వర్గానికి మధ్య రాజ‌కీయం ముదిరింది. జగన్‌ను మ‌ళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెబుతూ నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహాలన్నింటికీ కోటేష్‌ రంగులు వేయించడం మొదలుపెట్టారు.

అయితే.. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఆ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకుని.. రంగులు వేస్తున్న కార్మికులపై దాడులకు పాల్పడడంతో బరిగెల కోటేష్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రక్షణనిధిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తిరువూరు టికెట్‌ కోసం బ‌రిగెల కోటేష్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌క్ష‌ణ నిధికి పోటీగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోనూ టికెట్ ర‌గ‌డ కొన‌సాగుతోంది. వైసీసీ టికెట్‌ ఈసారి తనకే వస్తుందంటూ ఆ పార్టీకి చెందిన స్టీవెన్ చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌తో నిత్యం వివాదాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో ధూంధాంగా తన వర్గంతో కలిసి ప్రచారం కూడా నిర్వహించారు.

దళితవాడల్లో కేక్‌లు కోసి వేడుకలు చేశారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌లోనూ ఆందోళన మొదలైంది. స్టీవెన్‌ డీజేలు పెట్టి మరీ ప్రచారం చేసి వెళ్లిన కొద్దిసేపటికే కైలే అనిల్‌కుమార్‌ కూడా ఆయా ప్రాంతాలకు చేరుకుని కేక్‌ కోసి వేడుకలు చేశారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ ఇస్తార‌ని ఆయ‌న చెప్పుకొంటున్నారు. మొత్తంగా వైసీపీలో టికెట్ ర‌గ‌డ పీక్ స్టేజ్‌కు చేరింద‌ని అంటున్నారు.