చంద్ర‌బాబుకు పీకే స‌ల‌హా ఇదేనా?

“మ‌హిళా ఓటు బ్యాంకును మీకు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు బాగానే ఉన్నాయి. అయితే.. ఈసారి యువ‌త చాలా ఆవేశంతో ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధిలేక‌.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. దీనిని ఒక్క‌సారి గ‌మ‌నించండి. యువ‌త నాడిని ప‌ట్టుకుని.. వారికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించండి. వారి ఓటు బ్యాంకును మీ వైపు మ‌ళ్లించుకునే ప్ర‌య‌త్నం చేయండి” అని టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హా ఇచ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తాజాగా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ ఉండ‌వ‌ల్లిలోని బాబు నివాసంలో దాదాపు మూడు గంటలపాటు చర్చించిన విష‌యం తెలిసిందే. ఈ సమావేశంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన‌ కీలక అంశాలపై ఇరువురు చ‌ర్చించిన‌ట్టు స‌మాచా రం. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారని టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. వైసీపీ ప్రభుత్వ బలాబలా లను పీకే వివరించారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారు తీవ్ర ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని.. వారి ఓట్ల‌ను ఒడిసి ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని చంద్ర‌బాబుకు సూచించిన‌ట్టు తెలిపారు.

అదేస‌మ‌యంలో సాధార‌ణ ప్ర‌జ‌లు కొన్నాళ్లుగా ర‌గిలిపోతున్న నిత్యావ‌ర‌స‌ర ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు ప్రభావం చూపుతాయని, ఈ విష‌యాన్ని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని చంద్ర‌బాబుకు పీకే సూచించిన‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోవైపు.. దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయని పీకే అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలిసింది. ఇక‌, కేబినెట్‌లో ఒకరిద్దరు మినహా మిగిలిన‌ మంత్రులకు ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

ప్రజల అభిప్రాయాల మేరకు ప్రతిపక్షాల వ్యూహరచన ఉండాలని, అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని పీకే సూచించార‌ని టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. చంద్రబాబు అరెస్టుతో తటస్థులు, వైసీపీ వర్గాల్లో జగన్‌పై వ్యతిరేకత వచ్చిందని పీకే స్పష్టం చేశారని పేర్కొన్నాయి. ఇదిలావుంటే, భేటీ అనంత‌రం పీకే మీడియాతో మాట్లాడుతు.. “చంద్రబాబు సీనియర్ నేత కావడంతోనే కలిశా. ఎప్పటి నుంచో చంద్రబాబును కలవాలని అనుకుంటున్నా. మళ్ళీ కూడా చంద్రబాబును కలుస్తా.” అని అన్నారు.