సీనియర్ తమ్ముళ్ళ కొంప ముంచుతున్న జనసేన

పొత్తులన్నాక కొందరికి టికెట్లు ఎగిరిపోవటం చాలా సహజం. అయితే టికెట్లు దక్కకపోవడం ఎక్కడో ఒకటి రెండు నియోజకవర్గాల్లో అయితే పార్టీలు పెద్దగా పట్టించుకోవు. కానీ చాలామంది సీనియర్లకు టికెట్లు దక్కే అవకాశాలు ఉండవని తేలితే మాత్రం సీనియర్లలో అలజడి పెరిగిపోవటం ఖాయం. ఇపుడు ఇదంతా ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తులో సీనియర్ తమ్ముళ్ళ సీట్లలో జనసేన పోటీచేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే టీడీపీ-జనసేన పొత్తులో జనసేనకు కేటాయించబోయే సీట్లివే అన్న జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కాబట్టే.

ఆ జాబితా తప్పని కానీ నిజమే అని కానీ రెండుపార్టీల నుండి ఎవరు ఖండించలేదు, ధృవీకరించలేదు. ఏదేమైనా చాలా నియోజకవర్గాల్లో పోటీచేసే విషయంలో రెండుపార్టీల నేతలు గట్టిగా పట్టుబడుతున్న విషయం అయితే వాస్తవం. ఈ పొత్తుల అంశంపైనే టీడీపీ, జనసేన భవిష్యత్తు ఆధారపడుందన్నది నిజం. జాబితాలోని నియోజకవర్గాలను చూస్తే సీనియర్ తమ్ముళ్ళు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రు, కొండబాబు, బండారు సత్యానారాయణ మూర్తి, బండారు సత్యానందం, వర్మ నియోజకవర్గాలైన రాజమండ్రి రూరల్, పెందుర్తి, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ రూరల్ లాంటి నియోజకవర్గాలపైన జనసేన కన్నేసింది.

అలాగే కోవూరు, తణుకు, నర్సాపురం నియోజకవర్గాల్లో పోటీ చేయబోయేది తామే అని జనసేన నేతలు ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. జనసేన నుండి కొందరు నేతల దూకుడుకి తోడు తాజాగా చక్కర్లు కొడుతున్న జాబితాతో చాలామంది సీనియర్ తమ్ముళ్ళలో టెన్షన్ పెంచేస్తోంది.

జాబితా గనుక నిజమే అయితే సీనియర్లకు ఇబ్బంది తప్పేట్లు లేదు. ఎందుకంటే ఒకేసారి ఇంతమంది సీనియర్లకు చంద్రబాబు టికెట్లు నిరాకరించలేరు. ఒకవేళ తప్పదంటే వీళ్ళకి ప్రత్యామ్నాయాలను చూపాల్సుంటుంది. టికెట్ల నిరాకరణ కారణంగా సీనియర్ల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చంద్రబాబు ముందే వారితో మాట్లాడుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు, లేకపోతే ఎంపీలుగా పోటీచేయించే విషయాలను కొందరు సీనియర్లతో ఇప్పటికే చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పొత్తులు, సీట్ల విషయంలో అధినేతలు ఎంత తొందరగా క్లారిటి ఇస్తే అంతమంచిది.