అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతిస్తా: మల్లారెడ్డి

బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏం చేసినా సంచలనమే. పాలమ్మినా..పూలమ్మినా అంటూ డైలాగ్ చెప్పి ఓవర్ నైట్ లో వైరల్ గా మారిన మల్లారెడ్డి..హీరోల కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటూ చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతిస్తానంటూ తీన్మార్ మల్లన్నతో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మల్లారెడ్డి, తీన్మార్ మల్లన్న ఒకరికి ఒకరు ఎదురయ్యారు. ఆ తర్వాత మల్లన్నను ఆత్మీయంగా మల్లారెడ్డి ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శాసనసభలో ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ కు సభ్యులు తక్కువ అయితే మద్దతిస్తావా అంటూ మల్లారెడ్డిని మల్లన్న ప్రశ్నించారు. దీంతో కచ్చితంగా కాంగ్రెస్ కు మద్దతిస్తాను అంటూ మల్లారెడ్డి జవాబిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత అందరం ఒకటేనని మల్లారెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. అంతేకాదు, మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే ఎవరో ఒక మల్లన్న మాత్రమే అసెంబ్లీకి వచ్చేవారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే, అధికారంలో ఉన్న పార్టీ వైపు గోడ దూకేందుకు మల్లారెడ్డి మొగ్గుచూపుతుంటారని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు కాకపోయినా ఏదో ఒక సందర్భంలో మల్లారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అందులోను, మల్లారెడ్డి మాటతీరు, వ్యవహార శైలి, ఆయన క్రేజ్ తెలంగాణలో వేరే లెవెల్ లో ఉంది. కాబట్టి మల్లారెడ్డి ఎప్పుడు ఏం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఫలితాలు వెలువడిన మరుసటి రోజు కేటీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా డుమ్మా కొట్టారు. దీంతో, వారితోపాటు మరో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. అయితే, ఆ వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతల సమావేశానికి మల్లారెడ్డి హాజరయ్యారు. దీంతో ఆ పుకార్లకు చెక్ పడినట్లయింది.