కేసీఆర్ మ‌ళ్లీ వ‌స్తార‌నుకునే.. వాళ్లు అలా చేశారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పారిశ్రామిక దిగ్గ‌జాల నుంచి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల వ‌ర‌కు, బులియ‌న్ మార్కెట్ నుంచి ఇత‌ర వ్యాపార వ‌ర్గాల వ‌ర‌కు కూడా.. మ‌రోసారి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చేస్తార‌ని భావించిన‌ట్టు తాజాగా ఓ స‌ర్వే వెల్ల‌డించింది. దీంతో వారంతా.. కేసీఆర్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలిపింది.

కేవ‌లం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబ‌రు మ‌ధ్య కాలంలో.. అంటే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ఒక నెల ముందు వ‌ర‌కు కోట్ల‌కు కోట్ల రూపాయ‌లను బీఆర్ ఎస్ పార్టీకి విరాళాలుగా ఇచ్చిన‌ట్టు తెలుస్తొంది. తాజాగా బీఆర్ ఎస్ ఆస్తులు ఎంత అనే విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. ప్ర‌స్తుతంబీఆర్ ఎస్ ఆస్తులు గ‌త రెండేళ్ల‌లో 1136 కోట్ల రూపాయ‌లుగా తేలింది.

అయితే.. దీనిలో గ‌త ఏడాది అంటే.. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో 198 కోట్ల రూపాయ‌లు విరాళాలుగా వ‌చ్చాయి. ఇక‌, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎన్నిక‌లకు ముందు ఆరు మాసాల్లో మాత్రం రూ.938 కోట్లు విరాళాలుగా అందిన‌ట్టు పేర్కొంది. ఇది దేశంలో ఏ పార్టీకీ ఇంత త‌క్కువ స‌మ‌యంలో అందలేద‌ని కూడా పేర్కొంది. అయితే.. ఈ వివ‌రాల‌ను ప‌రిశీల‌న‌లోకి తీసుకున్న అసోచామ్ స‌ర్వే.. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి తదిత‌ర కీల‌క జిల్లాల్లో వ్యాపార వ‌ర్గాలు మ‌రోసారి కేసీఆర్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేసిన‌ట్టు చెబుతోంది.

అందుకే లెక్క‌కు మిక్కిలిగా కోట్ల రూపాయల క‌న‌క వ‌ర్షాన్ని కురిపించిన‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది. కేసీఆర్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. త‌మ వ్యాపారాలు పుంజుకుంటాయ‌ని.. లేదా.. త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌న్న ఉద్దేశంతోనే ఇలా భారీ ఎత్తున భూరి విరాళాలు స‌మ‌ర్పించి ఉంటార‌ని అసోచామ్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఎవ‌రు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చార‌నే వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. కానీ, తాజాగా ఎన్నిక‌ల్లోకేసీఆర్ పార్టీ ఓడిపోయిన విష‌యం తెలిసిందే.