జ‌న‌సేన‌, టీడీపీ నుంచి సిగ్న‌ల్ వ‌స్తే చాలు జంపింగ్‌కు రెడీ…!

వైసీపీలో ప‌రిణామాలు మారుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రిని పార్టీ అధిష్టానం ప‌క్క‌న పెడుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఎవ‌రిని తోసిపుచ్చి.. కొత్త‌వారికి ప‌గ్గాలు అప్ప‌గిస్తుందో తెలియని వైనం. దీంతో నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తాజాగా పార్టీ అధిష్టానం ఉరుములు లేని పిడుగు మాదిరిగా తీసుకున్న ఇంచార్జుల మార్పు నిర్ణ‌యం.. పార్టీలో తీవ్ర చ‌ర్చకు దారితీసింది.

ఒక‌వైపు రాజీనామాలు చేసే వారు చేస్తున్న స‌మ‌యంలో వారిని బుజ్జ‌గించ‌డ‌మో.. లాలించ‌డ‌మో.. వారి డిమండ్ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేయ‌డ‌మో మానేసిన వైసీపీ.. అనూహ్యంగా మ‌రో 11 మంది ఇంచార్జ్‌ల‌ను మార్చేయ‌డం.. కొత్త‌వారిని నియ‌మించ‌డం ఆఘ‌మేఘాల‌పై చేసేసింది. ఇక‌, వీరిలోనూ పెద్ద‌గా ఆరోప‌ణ‌లు లేని వారు ఉన్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల్లో తిరుగుతున్న‌వారు కూడా ఉన్నారు.

నిజానికి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారు.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త ఉన్న వారిని మార్చ‌లేదని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పులు కూడా చేయాల్సి వ‌స్తే.. అనేక మంది నాయ‌కులు ఎగిరిపోవ‌డం ఖాయం. అయితే.. ఈ దిశ‌గా కూడా వైసీపీ అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం అందుకున్న నాయ‌కులు పొరుగు పార్టీల వైపు చూస్తున్నార‌నేది వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

అయితే.. వీరంత‌ట వీరుగా వెళ్తే.. అక్క‌డ కూడా ప్రాధాన్యం ఉంటుందో ఉండ‌దో అని భావిస్తున్నందునే జంపింగులు ఇంకా స్టార్ట్ కాలేద‌ని అంటున్నారు. అలా కాకుండా టీడీపీ లేదా జ‌న‌సేనల నుంచి ఏ మాత్రం క‌నుసైగ వ‌చ్చినా.. వెంట‌నే వెళ్లిపోయేందుకు వెయిటింగ్‌లో ఉన్నార‌ని చాలా మంది నేత‌ల‌పై చ‌ర్చ సాగుతోంది. దాదాపు 50 మంది నాయ‌కులు ఈ జాబితాలో ఉన్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.