అదిరిపోయేలా సచివాలయ కూల్చివేత వ్యర్థాల లెక్కలు

తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి.. దాని స్థానంలో కొత్తది నిర్మించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలిసిందే. సచివాలయ కూల్చివేతపై హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్న వేళలో.. అధికారికంగా నిర్ణయం తీసుకొని యుద్ధ ప్రాతిపదికన కూల్చేశారు. సచివాలయ కూల్చివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టి దాదాపు నెలకు పైనే కావొస్తున్నా.. ఇప్పటివరకు వాటి వ్యర్థాల తరలింపే పూర్తి కాకపోవటం గమనార్హం.

దీనికి కారణం సచివాలయ వ్యర్థాలు భారీగా ఉండటంతో పాటు.. వాటిని తరలించేందుకు అవసరమైన వాహనాల సంఖ్య చూస్తే.. నోట మాట రాదు. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ తీరంలో ఠీవీగా దర్శనమిచ్చిన భారీ భవనాలు స్థానే.. ఇప్పుడు పెద్ద పెద్ద మట్టికుప్పలు.. వ్యర్థాలు కొండల మాదిరి కనిపిస్తున్నాయి. కూల్చివేతల కార్యక్రమానికి భారీ వర్షాలు ఆటంకంగా మారినట్లు చెబుతున్నారు.

మరో ఆసక్తికర అంశం ఏమంటే.. కూల్చేసిన సచివాలయ వ్యర్థాల పరిమాణం భారీగా మారింది. దగ్గర దగ్గర లక్ష టన్నులుగా (టన్ను అంటే వెయ్యి కేజీలు) ఉండొచ్చని చెబుతున్నారు. వీటిని తరలించాలంటే కనీసం 60వేల ట్రక్కులు అవసరముతాయని అంచనా వేశారు. నగర చరిత్రలో ఒకేచోట నుంచి లక్ష టన్నుల నిర్మాణ వ్యర్థాలు రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గడిచిన నెల రోజులుగా రోజుకు వంద ట్రక్కులతో రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తున్నా.. ఈ వ్యర్థాల కొండ మాత్రం తగ్గట్లేదని చెబుతున్నారు.

ఈ వ్యర్థాల రీసైక్లింగ్ సైతం భారీ వ్యయం కానుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే టన్ను వ్యర్థాల్ని రీసైక్లింగ్ చేయటానికి రూ.91వేల ఖర్చు అవుతుంది. ఈ లెక్కన లక్ష టన్నులంటే రీసైక్లింగ్ ఖర్చే భారీగా ఉండనుంది. రీసైక్లింగ్ చేసిన వ్యర్థాల్ని మళ్లీ నిర్మాణంలో వాడాలా? వద్దా? అన్న విషయం మాత్రం తేలలేదని చెబుతున్నారు. ఈ రీసైక్లింగ్ చేసిన దానితో ఫుట్ పాత్ లు.. ఫ్లోరింగ్ కు వాడుకునేలా.. ఫుట్ పాత్ లపై పరిచే ఇంటర్ లాకింగ్ టైల్స్ తయారీతో పాటు.. ప్రహరీలకు అవసరమైన భారీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్లాక్ లను తయారు చేయొచ్చని చెబుతున్నారు.