ఈ అహంకార‌మే.. తెలంగాణ‌లో అధికారం కూల్చేసింది: చంద్ర‌బాబు

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అహంకారంతో విర్ర‌వీగుతోంద‌ని.. ఈ అహంకార‌మే.. తెలంగాణ‌లో అధికారాన్ని కూల్చేసింద‌ని ఈ విష‌యాన్ని వైసీపీ పాల‌కులు గుర్తెర‌గాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోగా.. కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యలు చేశారు.

“ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారం ఉంటే ఏమౌతుందనేది తెలంగాణలో చూశామన్నారు. మరో మూడు నెలల తర్వాత ఏపీలో తెలంగాణ పరిస్థితే అంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం నందివెలుగులో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. మిచౌంగ్ తుఫాను కార‌ణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పొలాల్లోకి దిగి నీట మునిగిన చేల‌ను స్వయంగా పరిశీలించారు. రైతుల ఆవేదనను ఓపిక‌గా విన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ… మానవ తప్పిదం వల్లే రైతులు తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే, తనలాంటి వాళ్లని కూడా జైల్లో పెడతారని, భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తార‌ని వ్యాఖ్యానించారు. ముందస్తు చర్యలతో నష్ట నివారణ చర్యలకు అన్ని అవకాశాలు ఉన్నా, ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని మండిపడ్డారు. కౌలు రైతుల్ని చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుంటే, నష్టపోయిన ప్రతీ రైతుని 3 నెలల తర్వాత తానే ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కౌలు రైతుల్ని కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానన్నారు.

2011 లోనే నష్టపరిహారం కింద రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.10,000 ఇచ్చామని చంద్ర‌బాబు గుర్తుచేశారు. ఇప్పుడు ఎకరాకు రూ.30,000 ఇస్తే గానీ రైతులకు గిట్టుబాటు కాదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే మరో మూడు నెలలు గడిస్తే టీడీపీ అధికారంలోకి రాగానే తామే రైతులకు ప‌రిహారం ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు.