బీఆర్ఎస్‌-వైసీపీల బంధానికి నిదర్శనమీ ఫొటో

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీకి, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మ‌ధ్య బ‌ల‌మైన బంధం ఉంద‌ని అంటారు. అయితే.. ఈ విష‌యాన్ని ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌రు. అలాగ‌ని ఈ వాద‌న‌ను తోసిపుచ్చ‌రు కూడా. అప్పుడ‌ప్పుడు ఈ బంధం ఎంత గ‌ట్టిగా ఉందో మాత్రం .. ఇలా ఫొటోలు.. వ్యాఖ్య‌ల రూపంలో మాత్ర‌మే బ‌య‌ట ప్ర‌పంచానికి తెలుస్తుంది. ఇటీవ‌ల ఎన్నిక‌ల వేళ న‌వంబ‌రు 30న నాగార్జున సాగ‌ర్ జ‌లాశ‌యం వ‌ద్ద వైసీపీ ప్ర‌భుత్వం యుద్ధ‌మే ప్ర‌క‌టించినంత ప‌నిచేసింది.

అయితే.. ఇదంతా కూడా నీళ్ల కోసంకాద‌ని, న‌మ్మిన వారిని కాపాడేందుకు మాత్ర‌మేన‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. త‌ర్వాత ..మ‌రుస‌టి రోజు.. ఈ వివాదానికి తెర‌ప‌డి పోవ‌డం..ఏపీ పోలీసులు అటు నుంచి వెన‌క్కి రావ‌డం తెలిసిందే. ఎప్పుడు అవ‌స‌రం అయితే.. అప్పుడు అటు బీఆర్ ఎస్, ఇటు వైసీపీలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయ‌న్న విప‌క్షాల విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. తాజాగా వెలుగు చూసిన‌.. ఓ ఫొటో.. బీఆర్ ఎస్‌-వైసీపీల బంధం ఎంత బ‌ల‌మైందో తెలుస్తుంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియా చ‌క్క‌ర్లు కొడుతోంది.

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముఖ్య నాయ‌కుడు, ఎమ్మెల్సీ, మండ‌లిలో అధికార ప‌క్ష నాయ‌కుడు ఉమ్మా రెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు.. హృద‌య సంబంధిత స‌మ‌స్య‌తో హైద‌రాబాద్‌లోని కిమ్స్‌లో చేరారు. గ‌త నాలుగు రోజులుగా ఆయ‌న అక్క‌డే చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. తాజా మాజీ సీఎం కేసీఆర్ త‌ర‌ఫున ఆయ‌న‌ను తెలంగాణ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్ర‌త్యేకంగా వెళ్లి క‌లిసి ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. ఇక్క‌డ‌చిత్రం ఏంటంటే.. జ‌గ‌దీష్‌రెడ్డికి, ఉమ్మారెడ్డికి మ‌ధ్య పెద్ద‌గా ప‌రిచ‌యాలు లేవు. కానీ, బీఆర్ ఎస్ అధినేత త‌ర‌ఫున మాత్ర‌మే జ‌గ‌దీష్ రెడ్డి రావ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ప‌రామ‌ర్శ కార్య‌క్ర‌మం గుట్టుగానే సాగినా.. బ‌య‌ట‌కు మాత్రం లీకైపోయింది. దీనిపైనే నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.