ప‌వ‌న్‌ను బీజేపీ మోసం చేసిందా?!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీతో చేతులు క‌లిపి ముందుకు వెళ్లిన బీజేపీ.. పొత్తు ధ‌ర్మాన్ని విస్మ‌రించిందా? ప‌వ‌న్‌కు భారీ షాకే ఇచ్చిందా? నా నోట్లో నీ వేలు పెట్టు.. నీ కంట్లో నా వేలు పెడ‌తా! అన్న చందంగా వ్య‌వ‌హ‌రించి.. మొత్తానికే మోసం చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీతో పొత్తులో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎనిమిది ఇచ్చేందుకు కూడా.. బీజేపీ అనేక బేరాలు పెట్టింది. ష‌ర‌తులు కూడా విధించింది.

మాకు ప్ర‌చారం చేయాలి.. మీ ఇమేజ్ మాకు ఉప‌యోగ‌ప‌డాలి.. అని బీజేపీ పెద్ద‌లు తేల్చి చెప్పారు. దీనికి కూడా ప‌వ‌న్ ఓకే చెప్పారు. కానీ, వాస్త‌వానికి తెలంగాణ జ‌న‌సేన నాయ‌కులు 25 స్థానాలు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ విష‌యం ప‌వ‌న్ కూడా ప్ర‌స్తావించారు. క‌నీసంలో క‌నీసం 15 స్థానాలు ఇవ్వాల‌న్నారు. కానీ, బీజేపీ పెద్ద‌లు స‌సేమిరా అనేసి.. కేవ‌లం 8 స్థానాల‌కు క‌ట్ట‌డి చేశారు. పోనీ.. ఆ స్థానాల్లో అయినా.. జ‌నసేన‌కు పార్టీ త‌ర‌ఫున వారు చేసిందేమైనా ఉందా? అంటే.. లేనే లేదు.

తాజాగా వ‌చ్చిన తెలంగాణ ఫ‌లితాల్లో ఒక్క కూక‌ట్ ప‌ల్లి త‌ప్ప‌.. మిగిలిన ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయింది. కూక‌ట్ ప‌ల్లిలో మాత్రం డిపాజిట్ ద‌క్కింది. మ‌రి ఇంత‌గా జ‌న‌సేన ఓడిపోవ‌డానికి రీజ‌నేంటి? అంటే.. అంద‌రి వేళ్లూ క‌మ‌ల నాథుల వైపే చూపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను బీజేపీ న‌మ్మించి మోసం చేసింద‌ని అంటున్నారు.

ప‌వ‌న్ ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా ఆయ‌న‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చి అత్యంత స్వ‌ల్ప సంఖ్య‌లోనే సీట్ల‌ను క‌ట్ట‌బెట్ట‌డం ఒక త‌ప్ప‌యితే.. త‌మ ఓటు బ్యాంకును జ‌న‌సేన‌కు బ‌దిలీ చేయ‌క‌పోవ‌డం మ‌రో ప్ర‌ధాన మోసంగా చెబుతున్నారు. దీంతో క‌నీసం వెయ్యిలోపు ఓట్లు కూడా.. జ‌న‌సేన నాయ‌కులు ద‌క్కించుకోలేక పోయారు. వాస్త‌వానికి బీజేపీకి న‌గ‌ర స్థాయిలో 50మంది కార్పొరేట‌ర్లు ఉన్నారు.

బీజేపీ క‌నుక వీరికి స‌రైన ఆదేశాలు ఇచ్చి ఉంటే.. క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌కు బీజేపీ ఓట్లు ప‌డి గెలుపు గుర్రం ఎక్కి ఉండేవారు. కానీ, బీజేపీ అలా చేయ‌కుండా.. దుర్నీతి రాజ‌కీయాలు చేసింద‌నే టాక్ వినిపిస్తోంది. పైకి మాత్రం నీతులు చెబుతూ.. లోపాయికారీగా.. త‌న మిత్రుడి పార్టీనే దెబ్బేసేసింద‌నే వాద‌న వినిపిస్తోంది.