హ్యాండిచ్చిన బీజేపీ.. జనసేనకు జీరో

పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది జనసేన. పార్టీ పెట్టిన పదేళ్లలో ఏ రోజు కూడా అధికార పార్టీ మీద కానీ.. కేసీఆర్ పాలన గురించి కానీ..తెలంగాణ సమస్యల గురించి కానీ మాట్లాడని పవన్ కల్యాణ్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావటం అప్పట్లో ఆసక్తికర చర్చ నడిచింది.

తొలుత 22 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే.. బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు 8 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. అందులో గ్రేటర్ పరిధిలో కుకట్ పల్లి నియోజకవర్గం ఒకటి కాగా.. మిగిలిన ఏడు స్థానాలు జిల్లాలకు చెందినవే. అయితే.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు.. పార్టీ అధిక్యతను చూసినప్పుడు ఎక్కడా కూడా జనసేన పార్టీ అధిక్యతలో కనిపించని పరిస్థితి.

పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థుల పత్తా లేకుండా పోయారని చెప్పాలి. మరోవైపు.. బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే.. గౌరవనీయమైన స్థానాల్ని దక్కించుకునేలా కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. అది కూడా గోషామహాల్ లో రాజాసింగ్ గెలుపొందారు. ఆ తర్వాతి కాలంలో చోటుచేసుకున్న ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం తెలిసిందే.

మొత్తంగా చూస్తే.. చాలామంది అంచనాలు వేసినట్లే.. జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. చివరకు బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో అయినా గౌరవనీయమైన ఓట్లను సొంతం చేసుకుంటాయా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్ని చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాల్ని సొంతం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.