అలా జ‌రిగితేనే బండి సంజ‌య్ గెలుస్తార‌ట‌!

బండి సంజ‌య్‌. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలంగాణ బీజేపీ సార‌థిగా.. ఆపార్టీఫైర్ బ్రాండ్‌గా ఏడాదిన్న‌ర‌పాటు రాష్ట్రంలో రాజ‌కీయ కాక రేపిన నాయ‌కుడు సంజ‌య్‌. ప్ర‌స్తుతం ఆయ‌న క‌రీంన‌గ‌ర్ ఎంపీగా కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బండి గెలుపు అంత ఈజీ అయితే కాద‌నే అభిప్రాయం ఉంది.

గ‌త 2018 ఎన్నిక‌ల్లోనూ బండి పోటీ చేసి ఇక్క‌డ నుంచి ఓడిపోయారు. ఇక్క‌డ బీఆర్ఎస్ త‌ర‌ఫున మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ వ‌రుస విజ‌యాలు న‌మోదు చేస్తున్నారు. అయితే.. ఈ ద‌ఫా మాత్రం ఖ‌చ్చితంగా తాను గెలిచి తీరుతాన‌ని.. బీజేపీ త‌ర‌ఫున తాను చేసిన ప్ర‌య‌త్నాలు, పాద‌యాత్ర‌లు త‌న‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని.. బండి చెబుతూ వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు కూడా ముగిశాయి. మ‌రో 24 గంట‌ల్లో పోలింగ్ ఫ‌లితాలు కూడా రానున్నాయి.

ఈ నేప‌థ్యంలో బండి గెలుపుపై అంచ‌నాలు వ‌స్తున్నాయి. బండి గెలుపు.. ఎలా సాధ్యం అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పేరు త‌గిన‌ట్టుగానే.. ముస్లిం సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉన్నారు. దాదాపు 60 వేల మంది ముస్లింల ఓట్లే ఉన్నాయి. ఇక్క‌డ ముగిసిన పోలింగ్‌లో 63 శాతం న‌మోదైంది. దీంతో ముస్లింలలో క‌నీసం 30 నుంచి 35 వేల మంది ఓటేసి ఉంటార‌ని అంటున్నారు.

వీరి ఓట్లే గెలిచే అభ్య‌ర్తికి బూస్ట్‌గా మారుతుంది. సో.. ఈ లెక్క‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే. కాంగ్రెస్ అభ్య‌ర్థి పురుమ‌ళ్ల శ్రీనివాస్‌, బీఆర్ఎస్ నేత‌, మంత్రి గంగుల‌కే ముస్లిం ఓట్లు ప‌డే చాన్స్ ఉంది. ఒక‌వేళ‌.. వీరి మ‌ధ్య చీలిక వ‌చ్చి.. ఓట్లు క‌నుక స్ప్లిట్ అయితే.. అది బండికి అనుకూలంగా మారుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. ముఖ్యంగా బీసీలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో బండికి అనుకూల‌త ఉన్న‌ప్ప‌టికీ.. ఓటు బ్యాంకు ప‌రంగా.. ముస్లింల ఆద‌ర‌ణ కీల‌కంగా మారింది. దీంతో వీరి ఓట్లు చీలితే.. ఖ‌చ్చితంగా బండి గెలిచే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.