బీజేపీకి పెద్ద పరీక్షేనా ?

తాజాగా జరిగిన పోలింగులో మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా బీజేపీకి మాత్రం పెద్ద పరీక్షే ఎదురయ్యింది. అందులోను పోటీచేసిన అభ్యర్ధులందరిలో ఆరుగురి పరిస్ధితి మరీ ప్రత్యేకం. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు చాలా ప్రత్యేకం. ఎలాగంటే ఇపుడు పోటీచేసిన వారిలో ముగ్గురు ఎంపీలతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏల హోదాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కూడా పోటీచేసిన వాళ్ళున్నారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని నానా రచ్చ చేశారు.

ఇపుడు బీజేపీలో పోటీచేసిన ముగ్గురు ఎంఎల్ఏలు కూడా ఉపఎన్నికల్లో గెలిచిన వారే. ఇక ముగ్గురి ఎంపీల సంగతి చూస్తే మరీ ప్రత్యేకం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎంఎల్ఏగా పోటీచేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల సిగ్మెంట్ లో పోటీచేశారు. రఘునందనరావు దుబ్బాకలోను, ఈటల రాజేందర్ గజ్వేలు, హుజూరాబాద్, రాజాసింగ్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేశారు.

ఇపుడు విషయం ఏమిటంటే పార్టీ అధికారంలోకి రావటం సంగతి దేవుడెరుగు అసలు వీళ్ళ ముగ్గురు గెలుస్తారా అన్నదే పాయింట్. వీళ్ళల్లో బండి సంజయ్ కరీంనగర్లో గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. మిగిలిన ఐదుగురి గెలుపుపై ఎవరూ నమ్మకంగా చెప్పటంలేదు. ఈ ఎన్నికల్లో గనుక ఈ ఆరుగురు గెలవకపోతే పోయిన ఎన్నికల్లో ఏదో అదృష్టం కలిసొచ్చి గెలిచారంతే అన్న విమర్శలు బాగా పెరిగిపోతాయి. వీళ్ళు ఆరుగురు కూడా తమ గెలుపు ఖాయమని పదేపదే చాలెంజులు చేసిన విషయం తెలిసిందే.

తాజా ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్ధితిని గమనిస్తే అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ అనే అంటున్నారు కానీ ఎవరూ బీజేపీ ప్రస్తావన తేవటంలేదు. వివిధ సంస్ధలు నిర్వహించిన సర్వేల్లో కూడా బీజేపీకి మహాయితే 4 లేదా 5 సీట్లకు మించి రావని జోస్యాలు చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఎవరికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం కలగటంలేదు. ఈ పరిస్ధితే ఇపుడు పై ఆరుగురికి పెద్ద పరీక్షగా మారిపోయిందని చెప్పాలి.