వీళ్లు అయోధ్య‌-వాళ్లు తిరుమ‌ల‌.. ఎవ‌రిని ఏమ‌నాలి?

రాజ‌కీయాల్లో ఏమైనా చేయొచ్చు.. ఏమైనా మాట్లాడొచ్చు.. అనే వారికి ఇవి మ‌చ్చుతున‌కలు. బీజేపీ నేత‌లు ప్రారంభించిన‌.. గుడియాత్ర‌ల వ్య‌వ‌హారం.. ఏపీ వర‌కు పాకిపోయింది. మ‌మ్మ‌ల్ని గెలిపించ‌డం.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నానికి అయ్యే ఖ‌ర్చు భ‌రించి.. ఉచితంగా రాముడి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని. కేంద్ర మంత్రి అమిత్‌షా.. మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో ప్రచారం చేశారు. హిందువుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, అమిత్ షానే కాదు.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా.. ఈ విష‌యాన్ని జోరుగా ప్ర‌చారం చేశారు. త‌న సొంత రాష్ట్రంలో అయోధ్య రాముడు జ‌న‌వ‌రిలో కొలుదీర‌నున్నాడ‌ని.. ఆయ‌న ద‌ర్శ‌నంకోసం.. మిమ్మ‌ల్ని ఫ్రీగా తీసుకువెళ్లి.. ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అయితే.. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇస్తేనేన‌ని ఆయ‌న ష‌ర‌తు విధించారు. ఇలా.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నాల‌ను రాజ‌కీయం చేసిన క్రెడిట్ బీజేపీకే ద‌క్కింది.

ఇక‌, ఇప్పుడు ఏపీలోనూ ఇదే తంతు మొద‌లైంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిలు స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌ల‌కు.. తిరుమ‌ల యాత్ర‌ను ఫ్రీగా చూపిస్తున్నారు. అది కూడా బ్రేక్ ద‌ర్శ‌నాలు కావ‌డం గ‌మ‌నార్హం. రాయ‌దుర్గం నుంచి వారానికి రెండు బ‌స్సులు పెట్టి.. ఇక్క‌డి త‌మ అనుకూల వ‌ర్గానికి వారు శ్రీవారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. రాను పోను, ఖ‌ర్చుల‌తోపాటు తిరుమ‌ల‌లో గెస్ట్ హౌస్‌ల ఖ‌ర్చును కూడా వారే భ‌రిస్తున్నారు.

అయితే.. బ్రేక్ ద‌ర్శ‌న టికెట్‌ను మాత్రం యాత్రికులే సెంటిమెంటుగా చెల్లిస్తున్నారు. ఇక‌, తిరుమ‌ల నుంచి క‌ళ్యాణ ల‌డ్డూలు విరివిగా తెప్పించి.. నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తి.. ఇంటింటికీ పంచుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌ను గెలిపిస్తే.. కాశీ యాత్ర‌కు కూడా తీసుకువెళ్తామ‌ని హామీ ఇస్తున్నార‌ట‌. మొత్తానికి వాళ్లు అయోధ్య రాముడిని చూపిస్తామంటే.. వీరు తిరుమ‌ల శ్రీవారిని చూపిస్తున్నారు. ఎవ‌రిని ఏమ‌నాలి! అంతా రాజ‌కీయం.