కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ను జైలు అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించారని స్వయంగా జగన్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. కేవలం తనను అవమానించేందుకే జైలులో గ్రిల్ ముందు నిలబెట్టి ఫొటో తీశారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
మామూలుగా ఎవరినైనా కూర్చోబెట్టి ఫొటో తీసి పంపిస్తారని, కానీ, ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన తనను అవమానించడం కోసం గ్రిల్ బయట నిలబెట్టించి ఫొటో తీశారని ఆరోపించారు. చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని జగన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమ హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు తీసుకొస్తే, వీళ్లు అవమానించే కార్యక్రమాన్ని తెచ్చారని మండిపడ్డారు.
అందరికీ ఇలాగే నిలబెట్టి ఫొటోలు తీస్తారా అని తాను సూపరింటెండెంట్ ని అడిగానని, తనను మాత్రమే ఇలా నిలబెట్టి ఫొటో తీయాలని ఆదేశాలు వచ్చాయని ఆయన చెప్పారని జగన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండదని, ఈ రోజు ఈ ప్రభుత్వం మొదలుబెట్టిన తప్పుడు సంప్రదాయాలు రేప్పొద్దున రెండింతలు రిపీట్ అవుతాయని చంద్రబాబుకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే, జగన్ ఆరోపణలపై పోలీసు అధికారులు, జైలు అధికారులు స్పందించాల్సి ఉంది.
కాగా, రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు ఘటనే నిదర్శనమని జగన్ అన్నారు. ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తూ, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు జైల్లో తనను కూడా అవమానించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates