తెలంగాణ‌లో హంగ్.. ఏం జ‌రుగుతుంది…?

అత్యంత తీవ్రంగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారం ఒక‌వైపు.. ప్ర‌జానాడి అంద‌ని దుస్థితి మ‌రోవైపు.. ఇదీ ఇత‌మిత్థంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏ న‌లుగురు చ‌ర్చించుకున్నా వినిపిస్తున్న టాక్‌. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తే.. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 3 వేల మందికిపైగా అభ్య‌ర్థులు త‌ల‌ప‌డుతున్నారు. వీటిలో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ-జ‌న‌సేన‌, స‌హా బీఎస్పీ వంటి పార్టీలు ఉన్నాయి. వీటితో పాటు.. మ‌రో రెండు చిన్నాచిత‌కా పార్టీలు స్వ‌తంత్రులు కూడా పోటీ చేస్తున్నారు.

ఎటు చూసినా.. ఎన్నిక‌ల కోలాహ‌ల‌మే క‌నిపిస్తోంది. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. ఎన్నిక‌ల గురించిన చ‌ర్చే సాగుతోంది. కీల‌క నాయ‌కుల నుంచి అగ్ర‌నేత‌ల వ‌ర‌కు పార్టీల త‌ర‌ఫున హైద‌రాబాద్‌లో వాలిపోయారు. ప్ర‌చారాన్ని ముమ్మరంగా ముందుకు సాగిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు వివిధ హామీలు గుప్పిస్తున్నారు. ఇప్ప‌టికే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఇంకా వాటిలో పేర్కొన‌ని హామీల‌ను కూడా నాయ‌కులు ప్ర‌క‌టిస్తున్నారు.

సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు వ‌ర‌కు బీఆర్ ఎస్ ప‌క్షాన‌, బీజేపీ త‌ర‌ఫున ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా వ‌ర‌కు.. సీపీఎం త‌ర‌ఫున సీతారాం ఏచూరి, సీపీఐ త‌ర‌ఫున నారాయ‌ణ వంటి అగ్ర‌నాయ‌కులు.. ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, కాంగ్రె స్ నుంచి సోనియా మిన‌హా(ఈమె కూడా 27, 28న హైద‌రాబాద్‌లో ప్ర‌చారం చేస్తార‌ని టాక్‌) రాహుల్‌, ప్రియాంక గాంధీలు ప్ర‌చారాన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు.

అయితే.. ఎవ‌రు ఎంత‌గా ప్ర‌చారం చేసినా.. వ‌స్తున్న స‌ర్వేలు మాత్రం ఏ పార్టీకీ మొగ్గు చూప‌డం లేదు. అధికార పీఠాన్ని అందుకునేందుకు పార్టీలు ఎంత ప్ర‌య‌త్నం చేస్తున్నా.. తెలంగాణ స‌మాజం నాడిని ప‌ట్టుకోలేక పోతున్నారు. దీంతో హంగ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌ల‌కు మెజారిటీ సీట్లు ద‌క్కినా .. మేజిక్ ఫిగ‌ర్ చేరుకునేందుకు క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో హంగ్ త‌ప్ప‌క‌పోతే.. పొత్తుతో క‌లిసి పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం అనివార్యంగా మారుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఇదే జ‌రిగి.. హంగ వ‌స్తే.. ఏం జ‌రుగుతుంది? ఏ పార్టీ కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌నేది తాజాగా హాట్ టాపిక్ అయింది. బీజేపీ-బీఆర్ ఎస్ జ‌ట్టు క‌డ‌తాయ‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నా.. దీనిలో ప‌స‌లేద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఎందుకంటే.. ఆల్రెడీ.. బీఆర్ ఎస్‌-ఎంఐఎంలు పొత్తులో ఉన్నాయి. ఎంఐఎంకి.. బీజేపీకి పొత్తు కుద‌రదు. సో..బీజేపీ-బీఆర్ ఎస్‌తో క‌లిసిముందుకు సాగ‌దు. కాబ‌ట్టి బీఆర్ ఎస్‌-ఎంఐఎంలు క‌లిసి మెజారిటీ ఫిగ‌ర్ ద‌క్కించుకుంటే ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌వ‌చ్చు.

అలాకాక‌పోతే.. కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు వ‌స్తే.. చిన్నా చిత‌కా పార్టీలు ముఖ్యంగా బీఎస్పీ వంటివి ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో స్వ‌తంత్రులు కూడా ఆపార్టీకి మ‌ద్ద‌తు తెలిపే ఛాన్స్ ఉంది. అంతే త‌ప్ప‌.. బీజేపీతో చేతులు క‌లిపేందుకు ఏ పార్టీ కూడా సాహ‌సించ‌దు. ఇక‌, ఏం జ‌రుగుతుందో చూడాలి.